పెద్దపల్లి టౌన్, ఫిబ్రవరి 9 : రెండు నెలల నుంచి జీతాలు రాక గడ్డుకాలం ఎల్లదీస్తున్నామని ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లిలో కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనకు దిగారు. జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన కార్యకర్తలు, అధిక పనిభారం చేయలేమని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు అణవేన స్వరూప మాట్లాడారు.
గృహలక్ష్మి, అభయహస్తం అమలు, అర్హుల జాబితా కోసం తమపై అధిక పని భారం మెపుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ మధ్య జీతాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, మాలో నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఇక్కడ ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర నాయకుడు కట్కూరి శ్రీనివాస్రెడ్డి, సువర్ణ, స్వప్న,పద్మ, జ్యోతి, రజిత, మంజుల, రాజేవ్వరీ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కారు మాపై మోయలేని భారం వేస్తున్నది. రెగ్యులర్ విధులతోపాటు గృహలక్ష్మి, అభయహస్తం పథకాల అమలులో భాగంగా అర్హుల వివరాల నమోదు బాధ్యతలు మాకే అప్పజెప్పింది. అధిక పని భారం మోయలేం. ప్రతి నెల ఒకటో తేదీన మాత్రమే జీతాలు ఇవ్వాలి. హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. మా చదువుకు సాధ్యంకాని పనులు అప్పగించద్దని మా విజ్ఞప్తి.
– అణవేన స్వరూప, ఆశ కార్యకర్తల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు