కమాన్చౌరస్తా/కరీంనగర్ రూరల్/హుజూరాబాద్టౌన్/ గంగాధర/ తిమ్మాపూర్/ మానకొండూర్ రూరల్, జనవరి 13: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు ఆలయాల్లో శనివారం గోదాదేవీ రంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. నగరంలోని భగత్నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మేయర్ యాదగిరి సునీల్ రావు-అపర్ణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై గోదారంగనాథుల కల్యాణం జరిపించారు. స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో భక్తులకు, అయ్యప్ప దీక్షాపరులకు మేయర్ సునీల్ రావు దంపతులు అన్నదానం చేశారు. వేడుకల్లో అర్చకుడు శ్రీనివాస శర్మ, భక్తులు పాల్గొన్నారు. సప్తగిరికాలనీ కోదండరామాలయంలో అర్చకుడు రామాచార్యులు ఆధ్వర్యంలో గోదారంగనాథుల కల్యాణం నేత్రపర్వంగా జరిపించారు.
ఆలయ చైర్మన్ గౌతమరావు, కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 42వ డివిజన్లోని వావిలాలపల్లి రామాలయంలో గోదారంగనాథుల కల్యాణాన్ని వేద పండితుడు డాక్టర్ కలకుంట్ల వరప్రసాదాచార్యులు వైభవంగా జరిపించారు. స్వామి వారికి కార్పొరేటర్ మేచినేని వనజ-అశోక్ రావు పట్టు వస్త్రాలు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బీవీ రావు తలంబ్రాలు సమర్పించారు. ఇక్కడ ఆలయ కమిటీ అధ్యక్షుడు మేచినేని అశోక్ రావు, కోశాధికారి సిరికొండ వెంకటేశం, ఎం పవన్ రావు, ప్రవీణ్ రావు, రమ్యకృష్ణ, రవీందర్ రావు, డాక్టర్ సంజీవ్ రావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, పద్మనాయక కల్యాణ మండపంలో పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో గోదా రంగనాథుల కల్యాణం నిర్వహించారు. వేడుకల్లో సంఘం బాధ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్లోని వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుడు మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవీ రంగనాథుల కల్యాణం జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు కల్లెపల్లి సరళ-అశోక్, మాజీ ఉపసర్పంచ్ కోరుకంటి వేణుమాధవ్రావు, సాయిని తిరుపతి, బుర్ర హరీశ్ గౌడ్, తిరుపతి, శ్రీనివాస్, ఎస్ తిరుపతి, రమేశ్గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, హుజూరాబాద్ పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో గోదా రంగనాథస్వామి కల్యాణ విశేషాలను వేద పండితులు మాధవాచార్యులు, నికిల్ ఆచార్యులు, శ్రీధరాచార్యులు, రామాచార్యులు, సందీప్, సంహిత్ ఆచార్యులు భక్తులకు ఆసక్తికరంగా వివరించారు. గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీకోదండ సీతారామస్వామి ఆలయంలో శ్రీగోదా రంగనాయకస్వామి కల్యాణాన్ని నిర్వహించగా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక్కడ సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచ్ వేముల లావణ్యాఅంజి, ఆలయ కమిటీ చైర్మన్ వొడ్నాల రాజిరెడ్డి, నాయకులు సత్తు కనకయ్య, పుల్కం గంగన్న, రామిడి రాజిరెడ్డి, బట్టు లక్ష్మీనారాయణ, పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, దోర్నాల శ్రీనివాస్రెడ్డి, మంత్రి మహేందర్, తోట కరుణాకర్, పెంచాల చందు, ఆలయ పూజారి కూర్మాచలం పవన్కుమార్, భక్తులు పాల్గొన్నారు.
రామడుగు మండలం వెలిచాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోదాదేవీ రంగనాథస్వామి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వీర్ల ప్రభాకర్ రావు, సర్పంచ్ వీర్ల సరోజన, రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, మాజీ జడ్పీటీసీ కవిత, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ తాపాల లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో శ్రీ గోదారంగనాథ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకుడు తిరునగర్ వెంకటాద్రి స్వామి బృందం మంత్రోచ్ఛారణల మధ్య జరుగగా, ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్రెడ్డితో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, కార్యదర్శి కేతిరెడ్డి ఎల్లారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామంలోని శ్రీరామాలయంలో అర్చకుడు నమిలికొండ రఘురామాచార్యులు ఆధ్వర్యంలో శ్రీగోదారంగనాథుల కల్యాణాన్ని నిర్వహించారు.