Godavarikhani | ఫర్టిలైజర్ సిటీ : శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంధీ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బీ రామ్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి, రవీందర్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని 5-ఇంక్లైన్, విఠల్ నగర్, తిలక్ నగర్ డౌన్, తిలక్ నగర్, రమేష్ నగర్, చంద్ర శేఖర్ నగర్, సంతోష్ నగర్, ద్వారకా నగర్ ప్రాంతాలలో సీఐ-2, ఎస్సై 12, సిబ్బంది 100 మంది తో ఒకేసారి నేర నియంత్రణ ముందస్తు చర్యలు భాగంగా నాకాబంధీ నిర్వహించి వాహనాలను తనిఖీలు నిర్వహించారు.
ఈ వాహన తనిఖీల్లో పెద్దపెల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ స్వయంగా పాల్గొని వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అక్రమ రవాణా, ప్రభుత్వ నిషేధిత పదార్థాలు రవాణా, అనుమానిత వ్యక్తుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనలను అరికట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. నేరాలకు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు, అనుమానితులు, దొంగిలించబడిన వస్తువులు, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి, భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఇతర నేరాలను నివారించేందుకు ఈ తనిఖీలు నిర్వహించారు.
నాకాబంధీ సమయంలో అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించామన్నారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ వంటి ధ్రువ పత్రాలను పరిశీలించినట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్, వాహన ధ్రువ పత్రాలు లేని వారిపై పోలీస్ అధికారులు కేసులు నమోదు చేసి, 80 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 3 కార్లకు జరిమానా విధించినట్లు పేర్కన్నారు. వారికి రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వాహనదారుల వివరాలు, వారు వెళ్లే ప్రదేశం వివరాలు, వాహనాలలో ఉన్న వారి వివరాలు తెలుసుకోవడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి ఈ నాకాబంధి చేపట్టినట్లు డీసీపీ తెలిపారు.
ఈ ప్రక్రియ నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రోజూ చేడుతామని డీసీపీ పేర్కొన్నారు.10 గంటల తరువాత స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతామని, నూతన సంవత్సర వేడుకలు ఎవరి కుటుంబ సభ్యులతో ఇంట్లో జరుపుకోవాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది కలిగించే లాగా ప్రవర్తించడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యువత తాత్కాలిక ఆనందాల కోసం తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.