వేములవాడ టౌన్ , డిసెంబర్ 15 : వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గురువారం రాత్రే రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజామున పవిత్ర గుండంలో పుణ్య స్నానాలు చేశారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. క్యూలైన్ల గుండా వెళ్లి రాయేశుడిని దర్శించుకున్నారు.
అభిషేక, అన్న, ఆకుల, కుంకుమపూజలు, పల్లకీ సేవలు, కల్యాణాల మొక్కులు, సత్యనారాయణవ్రతాలు, చండీహోమాల మొక్కులు తీర్చుకున్నారు. రాజన్నను దాదాపు 8 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో రానుండగా, ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. భక్తులు సహకరించాలని కోరారు.