హరితహారానికి సన్నద్ధంగా యంత్రాంగం
దిగ్విజయంగా ఏడు విడుతలు
జిల్లా లక్ష్యం 33.72లక్షలు
అమాత్యుడు రామన్న బర్త్డేన పెద్ద ఎత్తున నాటేందుకు ఏర్పాట్లు
హరిత తెలంగాణే లక్ష్యంగా ఏడు విడుతలుగా చేపట్టిన హరితహారం విజయవంతంగా ఎనిమిదో విడుతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 33.72 లక్షల మొక్కలు నాటే ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే 72 రకాల 65 లక్షలు మొక్కలు అందుబాటులో ఉండగా శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లా అంతటా నాటేందుకు రెడీ అయింది. అవెన్యూ ప్లాంటేషన్, పల్లెప్రకృతి వనాలు, చెరువుగట్లు, శ్మశాన వాటికలు, మైదాన ప్రాంతాలు, డంపింగ్ యార్డులు, గుట్టలపైనా మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీస్తుండగా జిల్లాకు పచ్చలహారం తొడిగేందుకు నడుం బిగించింది.
రాజన్న సిరిసిల్ల, జూన్ 19 (నమస్తే తెలంగాణ): హరిత తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన హరితహారం జిల్లాలో విజయవంతమైంది. ఏడు విడుతల్లో నాటిన మొక్కలన్నీ ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుండగా, అదే స్ఫూర్తితో 8వ విడుతకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీ నర్సరీల్లో 65లక్షల మొక్కలు అందుబాటులో ఉంచారు. ఈ వానకాలంలో 33.72లక్షలు నాటాలన్న లక్ష్యం మేరకు శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే కలెక్టర్ అనురాగ్ జయంతి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, చెరువుగట్లు, శ్మశాన వాటికలు, మైదాన ప్రాంతాలు, డంప్ యార్డులు, గుట్టల పైనా మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయిస్తున్నారు. ఈ ఏడాది పండ్ల మొక్కలు సహా 72 రకాలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించింది.
దిగ్విజయంగా ఏడు విడుతలు
హరితహారం కార్యక్రమం జిల్లాలో పూర్తిస్థాయిలో దిగ్విజయమైంది. నాటిన మొక్కలను వందకు వంద శాతం సంరక్షించడంలో జిల్లా యంత్రాం గం సఫలీకృతమైంది. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యతను స్థానిక పంచాయతీలకు అప్పగించింది. అందుకోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల మందిని నియమించింది. ఉపాధి హామీలో భాగంగా వీరిని నియమించారు. రోజుకు రూ.250 చొప్పున కూలీ చెల్లిస్తున్నారు. నాటిన మొక్క ఎండిపోతే దాని స్థానంలో మరో మొక్కను నాటుతున్నారు. ట్రీగార్డులు ఏర్పాటు చేయడంతోపాటు నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు. ప్రభుత్వం 2015లో ప్రారంభించిన హరితహారం ఏడు విడుతలు విజయవంతంగా పూర్తి చేసుకుని 8వ విడుతకు సన్నద్ధమవుతున్నది.
మంత్రి కేటీఆర్ బర్త్డేకు గిఫ్ట్గా పచ్చల హారం
మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బర్త్డే జూలై 24న కానుకగా జిల్లా ప్రజలు ‘పచ్చలహారం’ కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఒకేరోజు జిల్లా వ్యాప్తంగా లక్ష వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ రోజు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు హరిత హారంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ సారి కూడా అమాత్యుడి పుట్టినరోజున జిల్లాకు పచ్చలహారం తొడిగేందుకు భారీఎత్తున పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. అధికార యంత్రాంగం నిర్దేశించిన లక్ష్యం కన్నా రెట్టింపు మొక్కలు నాటేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.
ఊరికో నర్సరీ
అమాత్యుడి మార్గదర్శకత్వంలో జిల్లా యంత్రాం గం హరితహారం కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నది. రోడ్ల వెంట నాటిన మొక్కలు వృక్షాలై నీడనిస్తున్నాయి. ఎటు చూసినా పల్లెలు పచ్చగా కనిపిస్తున్నాయి. పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితహారంలో నాటే మొక్కలను పెంచేందుకు ఊరికో నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి పంచాయతీకో పక్కా స్థలంలో నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. నర్సరీలు, నాటిన మొక్కలను జియోట్యాగింగ్ చేస్తున్నారు. ఎర్రచందనం, ఉసిరి, మారేడు, చింత, చీమ చింతకాయ, జామ, అల్లనేరుడు, విరుకు, దానిమ్మ, మామిడి ఇలా రకరకాల పండ్ల మొక్కలను నాటేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కోతుల కోసం అడవులు, రహదారులు, మైదాన ప్రాంతాల్లో పండ్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్ర చందనం, టేకు, వెదురు, కానుగ, గుల్మోర్ లాంటి మొక్కలు సైతం అందుబాటులో ఉంచారు. ఇళ్లలో పూలమొక్కలు, తులసి, కృష్ణతులసీ లాంటి మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 72రకాల మొక్కలు నాటాలని లక్ష్యంతో ముందుకుపోతున్నారు. ఈ వానకాలంలో 33.72లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈజీఎస్లో భాగంగా 13 మండలాల్లో 19లక్షల మొక్కలు నాటేందుకు 1406 ప్రాంతాలను గుర్తించారు.
65 లక్షల మొక్కలు సిద్ధం
ఎనిమిదో విడుత హరిత హా రానికి అంతా సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. 255 నర్సరీల్లో 65లక్షల మొక్కలు పెంచుతున్నాం. ఈసారి 33.72లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా 72 రకాల మొక్కలున్నా యి. పండ్ల మొక్కలకు అధిక ప్రాధాన్యమిస్తు న్నాం. 39 ప్రభుత్వ శాఖలకు లక్ష్యాన్ని నిర్దేశిం చాం. ఏడు విడుతలుగా చేపట్టిన హరితహారం జిల్లాలో దిగ్విజయంగా పూర్తయింది. అదే స్ఫూర్తితో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో అన్ని శాఖలు కలిసి ముందుకుపోతున్నాం. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులను ఇందులో భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– చికోటీ మదన్మోహన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి (రాజన్న సిరిసిల్ల)