ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 27,87,549 మంది ఓటర్లు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 29,73,045కు చేరింది. అంటే 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. గత చరిత్రలో ఎప్పుడు చూసినా లక్షకు మించి పెరిగిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ తాజా జాబితాపై దృష్టి సారించాయి. నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో పెరిగిన ఓటర్ల సంఖ్యపై జోరుగా చర్చ సాగుతుండగా, ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో లక్ష వరకు పెరుగవచ్చని అంచనా వేస్తున్నాయి.
కరీనంగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతిధి) : తాజా, ఓటరు జాబితా ప్రకారం గత నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిజానికి 2014తో పోలిస్తే 2018 ఎన్నికల సమయం నాటికి ఓటర్ల సంఖ్య తగ్గింది. 2014కు 2018కి మధ్య నాలుగేళ్ల సమయం ఉన్నా అప్పట్లో ఓటర్ల సంఖ్య పెరగలేదు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో ఉన్న ఓటర్ల సంఖ్య 28,27,556 ఉండగా.. 2018 ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 27,87,549కి తగ్గింది. అంటే రెండు ఎన్నికల మధ్య 40,007 మంది ఓటర్లు తగ్గారు.
నిజానికి అసెంబ్లీ ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య ఓటర్ల సంఖ్య పెరగాలి. కానీ, తగ్గింది. ఈ విషయంపై ఆప్పట్లో భారీ చర్చ జరిగింది. అయితే.. గతంలో ఓటరు జాబితా ఆధార్కు అనుసంధానం లేకపోవడం, ఇంటింటా సర్వే జరగకపోవడం వల్ల భారీగా బోగస్ ఓట్లు ఉన్నాయని, అలాగే చనిపోయిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండిపోయాయని, వాటిన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి తొలగించడం వల్లే ఓటర్ల సంఖ్య తగ్గిందని అప్పట్లో సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. అంతేకాదు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని.. అర్హత గల ఓటరును ఎక్కడైనా తొలగించినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ, ఎక్కడి నుంచి పెద్దగా ఫిర్యాదులు అందలేదు. దీంతో తగ్గిన ఓటర్ల సంఖ్యతోనే ఆనాడు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.
కరీంనగర్లో అత్యధికం
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఓటర్ల సంఖ్యను నిశితంగా పరిశీలిస్తే కరీంనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 35,243 మంది ఓటర్లు పెరిగారు. రెండో స్థానంలో 26,148 ఓటర్లతో హుజూరాబాద్ ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో చూస్తే.. కోరుట్లలో 7,793, జగిత్యాలో 10,668, ధర్మపురిలో 4,195, రామగుండంలో 15,570, మంథనిలో 13,368, పెద్దపల్లిలో 18,123, చొప్పదండిలో 15,339, వేములవాడలో 15,803, రాజన్న సిరిసిల్లలో 9,493, మానకొండూరులో 9,095, హుస్నాబాద్లో 4,657 మంది ఓటర్లు పెరిగారు.
చరిత్రలో రికార్డు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లా యం త్రాంగం ఓటర్ల జాబితాను ఇటీవల సవరించిన విష యం తెలిసిందే. అందులో భాగంగా ఇంటింటికీ తిరిగి అర్హతలేని వారిని తొలగిస్తూనే అర్హులను చేర్చింది. మరికొంత మంది అన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. విచారణ పూర్తిచేసి అధికారులు వారిని సైతం ఓటరు జాబితాలో చేర్చారు. సవరించిన తుది జాబితాను నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితా ఈసారి ఉమ్మడి జిల్లాలో రికార్డు సృష్టించింది. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నాలుగేళ్లలో ఏకంగా 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. గత చరిత్రలో ఎన్నికకు ఎన్నికకు మధ్య లక్షకు మించి ఓటర్లు పెరిగిన దాఖలాలు లేవు. నిజానికి 2018 ఎన్నికల సమయంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అధికారిక ఓటర్ల సంఖ్య 27,87,549 ఉండగా, తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం 29,73,045 మంది ఉన్నారు. అంటే, నాలుగేళ్లలో 1,85,496 మంది పెరిగిన తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది.