కలెక్టరేట్, జనవరి 11: అధికారులు, ప్రజాప్రతినిధులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లి కంటి వెలుగు-2ను విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ దిశానిర్దేశం చేశారు. బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీ, జడ్పీటీసీలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటి వెలుగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ నెల 18న రెండో విడుత కంటి వెలుగును ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు.
నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్క డా లేని విధంగా రికార్డు స్థాయిలో కోట్లాది మందికి కంటి పరీక్షలు చేసేందుకు కేసీఆర్ సర్కారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, కంటివెలుగు-2ను విజయవంతం చేసేందుకు పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేశామని తెలిపారు. మొత్తం 6.19 లక్షల మందికి పరీక్షలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విడుతల వారీగా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు కంటి పరీక్షలు చేస్తామన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కంటివెలుగు నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, అదనపు కలెక్టర్ బీ సత్యప్రసాద్, డీఎంహెచ్వో సుమన్మోహన్రావు, కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.