మామిడి తోటలకు పేరుగాంచిన అంతర్గాం, ఇప్పుడు తీరొక్క పంటలకు కేరాఫ్గా నిలుస్తున్నది. ఇన్నాళ్లూ వరి సాగుకే మొగ్గు చూపిన ఇక్కడి రైతాంగం, ఇటీవలి కాలంలో ఉద్యానవన తోటలవైపు మళ్లింది. పండ్లు, కూరగాయల సాగుతోపాటు ఒకే సారి రెండు మూడు రకాల పంటలను పండిస్తున్నది. రెండువేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 300 మంది రైతులు 500 ఎకరాల్లో కూరగాయలు, మరో 500 ఎకరాల్లో వివిధ రకాల పండ్లు పండిస్తున్నారు. మంచిలాభాలను ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జగిత్యాల, ఫిబ్రవరి 25, (నమస్తే తెలంగాణ) : అంతర్గాం మొదటి నుంచి మామిడి తోటలకు పేరుగాంచింది. అయితే కొన్నేళ్లుగా మామిడి తోటల సాగులో మార్పు మొదలైంది. మేలు రకాలైన బంగినపెల్లి, హిమాయత్, మల్లిక, దశేరీ రకాలకు చెందిన చెట్లను పెంచడం మొదలు పెట్టారు. వీటితోపాటు ఇతర పండ్లు, కూరగాయల తోటలు సాగు చేస్తున్నారు. అరటి తోటలు ఇక్కడ పెంపకంలో ఉన్నాయి. దాదాపు 30 ఎకరాల్లో అరటి తోటలు పెంచుతున్నారు. 15 మంది రైతులు 50కి పైగా ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నారు.
20 మంది రైతులు 40 ఎకరాల్లో బొప్పాయి తోటలు సాగు చేస్తున్నారు. ఐదువందల ఎకరాల్ల్లో 80 మంది రైతులు మామిడి తోటలను పెంచుతున్నారు. 30 ఎకరాల్లో 10 మంది రైతులు జామ తోటలు సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ దాదాపు పది ఎకరాల్లో అంతర్గాంలో సాగు చేయబడుతోంది. 10 ఎకరాల్లో ఐదుగురు రైతులు దానిమ్మ తోటలను సాగు చేస్తున్నారు. ఇక బీర, కాకర, సోర లాంటి తీగజాతికి చెందిన కూరగాయలను విస్తృతంగా పెంచుతున్నారు. దాదాపు నలభై మంది రైతులు బీర, కాకర, సోరకాయల పెంపకం చేపడుతున్నారు. వీటితో పాటు, టమాట, కొత్తిమీర, మెంతి, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, మిరపకాయ, అనపకాయ, చిక్కుడుకాయ, పల్లి, బబ్బెర చేన్లను యాభై మంది రైతులు చేపట్టారు.
వీటితో పాటు, నౌకల తయారీకి ఉపయోగపడే మహాగని చెట్లను సైతం ఇక్కడి రైతులు పెంచుతుండడం విశేషం. ముంబైకి చెందిన ఒక ప్రముఖ నౌక తయారీ కంపెనీతో ఒప్పందం చేసుకున్న పది మంది రైతులు దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో మహాగని చెట్లను పెంచుతున్నారు. 12 నుంచి 14 ఏండ్ల వ్యవధిలో ఈ చెట్లు మహావృక్షాలుగా మారిన తదుపరి చెట్లను పంపిణీ చేసి, ఒప్పందం చేసుకొన్న కంపెనీకి ఈ కలపను విక్రయిం చనున్నారు. కాగా, తాజాగా ఆయిల్ పామ్ పెంపకంపై సైతం ఇక్కడి రైతులు ఆసక్తిని చూపుతున్నారు. అంతర్గాం గ్రామానికి చెందిన 30 మంది రైతులు ఇప్పటికే 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ చెట్లను పెంచేందుకు డీడీలు చెల్లించి, మొక్కలు నాటారు. ఇప్పటి వరకు గ్రామంలో 30 ఎకరాల్లో చెట్లు నాటే ప్రక్రియ పూర్తి చేయబడింది.
సంప్రదాయ పంటలతో రైతులకు పెద్దగా లాభాలు రావడం లేదు. ఒకే పంటను ఏటా రెండు సార్లు పండించడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటున్నది. అందుకే పంటలను మారుస్తున్నం. కూరగాయలు, పండ్ల తోటల పెంపకం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తన్నయ్. ఏ సీజన్లో నైనా కూరగాయల సాగుతో రైతుకు రోజువారీగా ఆదాయం ఉంటుంది. దీనికి తోడు కూరగాయల సాగుకు పెద్ద విస్తీర్ణం అవసరం లేదు. కొత్మీర, మెంతి లాంటి పంటలు తొందరలోనే చేతికి వస్తయ్. అంతర్గాంలో చాలా మంది రైతులు ఇప్పుడు కూరగాయలు, పండ్ల తోటలు వేస్తున్నరు. కొత్తగా వచ్చే ఆయిల్ పామ్, డ్రాగన్ ఫ్రూట్ లాంటి వాటిని సైతం మా సాగు చేస్తున్నరు.
– నక్కల రవీందర్రెడ్డి, ఆదర్శ రైతు
కూరగాయలు, పండ్ల తోటల పెంపకంతో ఒక ప్రయోజనం ఉన్నది. వరి వేస్తే ఒకే పంటను సాగు చేయాల్సి ఉంటుంది. పండ్ల తోటలు, కూరగాయల సాగు విషయంలో ఒకేసారి రెండు మూడు పంటలు సాగు చేసే అవకాశముంటుంది. జామ తోటను సాగు చేస్తున్న రైతులు అందులో అంతర పంటగా వేరేదాన్ని సాగు చేసుకోవచ్చు. పసుపును సాగు చేస్తున్న వారు అంతర పంటగా బొప్పాయిని సాగు చేస్తున్నరు. నేను జామ తోటను సాగు చేస్తూ మధ్యలో మహాగని చెట్లను పెంచుతున్న. నాలాగే చాలా మంది అంతర పంటలు సాగు చేస్తున్నరు.
– పొద్దుటూరి సంతోష్రెడ్డి, రైతు
అంతర్గాంలో దాదాపు 300 మంది రైతులు కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. అందులో చాలా మంది రైతులు రెండుకు మించి పంటలు వేస్తున్నారు. రాజిరెడ్డి అనే రైతు, మామిడి, వరి, మహాగని, చెరుకు తోటలను సాగు చేస్తున్నాడు. నక్కల రవీందర్రెడ్డి, బీర, కాకర, సోరతో పాటు, మామిడి, చెరుకు పంటలతో పాటు రెండు ఎకరాల్లో ఆయిల్ పామ్ చెట్ల పెంపకాన్ని మొదలు పెట్టారు. పొద్దుటూరి సంతోష్ రెడ్డి అనే యువ రైతు తనకు ఉన్న ఏడెకరాల్లో రెండు ఎకరాల్లో ‘అల్ ఫైదా బ సఫే’ అనే రకానికి చెందిన జామ తోటను సాగు చేస్తున్నాడు. ఈ తోట మధ్యలో మహాగని చెట్లు పెంచుతున్నాడు. సుభాష్రెడ్డి డ్రాగన్ ఫ్రూట్, సీతాఫల్, జామతోటలను సాగు చేస్తున్నాడు. సూర రాజం తనకు ఉన్న రెండెకరాల్లో బొప్పాయి తోట, టమాట, కొత్తిమీర, మెంతిని వేస్తున్నాడు. గ్రామంలో చాలా మంది రైతులు రెండుకు మించి కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు.
గతంతో పోలిస్తే వ్యవసాయం మారిపోయింది. మునపటిలా మా అంతర్గాం గ్రామంలో రైతులు వరిని నమ్ముకోవడం లేదు. అలాగే ఏదో ఒక పంటను వేయడం లేదు. వరితోపాటు కూరగాయల సాగు, పండ్లతోటలు పెంచితే లాభం అధికంగా కనిపిస్తున్నది. మామిడితోపాటు కొత్త రకమైన పంటలను పండించాలన్న ఆలోచన వచ్చింది. ఊరిలో దాదాపు 500 ఎకరాల్లో తీరొక్క పంటలు వేస్తున్నరు. చాలా మంది రెండు మూడు పండ్ల తోటలు, కూరగాయలను సాగు చేస్తున్నరు. ఒకదానికి నష్టం వచ్చినా, మరోదానితో నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఈ మార్పు వల్ల రైతులకు మేలు జరుగుతున్నది.
– రాజిరెడ్డి, రైతు
నేను రెండు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోటను సాగు చేస్తున్న. ఒక ఎకరంల సాగుకు సుమారు 12 లక్షలు అయ్యింది. చెట్టుకు 12 ఫీట్లు, వరుసకు 8 ఫీట్ల చొప్పు 507 పిల్లర్లను తయారు చేయించిన. ఓక్కో పిల్లర్కు నాలుగు మొక్కల చొప్పున ఒక ఎకరానికి 2028 మొక్కలు నాటిన. ఏడాదిగా దిగుబడి వస్తున్నది. ఈ పంట ఆదాయాన్ని బట్టి మరికొన్ని భవిష్యత్తులో మరి కొంత భూమిలో సాగు అంశాన్ని పరిశీలిస్త. ఈ పంటను పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే పండిస్తున్న. దిగుబడి గణనీయమైన స్థాయిలోనే వస్తుంది. అయితే దీనికి మార్కెటింగ్ సౌకర్యం ఉంటే మరింత మెరుగ్గా ఉంటుంది. డ్రాగన్తో పాటు, జామతోటను సైతం సాగు చేస్తున్న.
– క్యాతం సుభాష్రెడ్డి, రైతు
జగిత్యాల జిల్లాలో సేద్యానికి అనుకూల వాతావరణం ఉన్నది. నీటి వసతి బాగున్నది. కాళేశ్వరం నీరు అందుబాటులోకి రావడంతో భూగర్భ జలాలు సైతం పెరిగిపోయాయి. దీంతో రైతులు గతంలో బీడు పెట్టిన భూముల్లో సైతం సేద్యం చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, కూరగాయల సాగుపై సైతం వారు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అంతర్గాంలో ఓ యువ రైతు డ్రాగన్ ఫ్రూట్ పంటను, అలాగే జామ తోటను సాగు చేస్తున్నారు. సీతాఫల తోటను సైతం మొదలుబెట్టారు. బొప్పాయి, అరటి తోటలు వేస్తున్నారు. వీటితో పాటు, మామిడి, పసుపు, మిర్చి, దానిమ్మ లాంటి పంటలు, బీర, కాకర, సోరకాయ, అలసంద, టమాట వంటి కూరగాయల పంటలు సైతం గణనీయమైన విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గతంలో కేవలం వరి సాగుపైగా ఆసక్తిని చూపిన రైతులు ఇప్పుడు పండ్లతోటల వైపు దృష్టి సారిస్తున్నారు. అలాగే ధర్మపురి, జగిత్యాల మండలం ఉత్తర ప్రాంతంలోని గ్రామాల్లో క్యాబేజీ, వంకాయ, బీరకాయ, చిక్కుడు కాయ, కాకరకాయ, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. రైతుల దృక్పథంలో మార్పురావడం సంతోషంగా ఉంది.
– ప్రతాప్సింగ్, జగిత్యాల జిల్లా ఉద్యానవన శాఖ అధికారి