కార్పొరేషన్, జనవరి 2: కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో సరికొత్త కార్యక్రమానికి నగర మేయర్ వై.సునీల్రావు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధుల వద్దకు ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడం కన్నా వారి వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజలతో మేయర్ ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం ఈ కార్యక్రమాన్ని 33వ డివిజన్లో ప్రారంభించారు. డివిజన్లోని ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించే దిశగా నగరపాలక అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా తదితర వాటిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ చేపడుతున్న పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సహకారంతో అభివృద్ధి పనులు చేపటినట్లు తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు నేరుగా తెలుసుకోవాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్, ఆర్వో ఆంజనేయులు, పారిశుధ్య విభాగం సూపర్వైజర్ రాజమనోహర్, ఈఈ మహేందర్, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.