అంగన్వాడీ కేంద్రాలు సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. పిల్లల్లో ఎదుగుదల లోపాలు నివారిస్తూ, మాతా శిశు మరణాల నిర్మూలనే లక్ష్యంగా పౌష్టికాహారం అందించిన ఈ సెంటర్లు నెలరోజులుగా సరుకుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రధానంగా గర్భిణులు, బాలింతలకు నిత్యం అందించే పాల సరఫరా నిలిచిపోయింది. ఇక పప్పులు, ఇతర సరుకులు నిండుకోవడంతో పక్క కేంద్రాల నుంచి చేబదులుగా తెచ్చి వంట చేయాల్సిన దుస్థితి దాపురించింది. కొత్త ఒప్పందం పేరిట నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తుండగా, అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 3: అంగన్వాడీ కేంద్రాల్లో సరుకులు నిండుకుంటున్నాయి. ఆరోగ్యలక్ష్మిలో భాగంగా ప్రతి నెలా సరఫరా చేయాల్సిన సరుకుల్లో ఏదో ఒకటి కోత పెడుతుండగా, గుత్తేదారులు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 25 నుంచి జిల్లాకు పాల సరఫరా నిలిచిపోగా, గర్భిణులు, బాలింతలకు అందించలేకపోతున్నారు. పౌష్టికాహారంలో భాగంగా నిత్యం ఉపయోగించాల్సిన పప్పులు కూడా నిండుకోవడంతో టీచర్లు పక్క కేంద్రాల నుంచి చేబదులుగా తెచ్చి వంట వండుతున్నారు.
అక్కడా కూడా సరుకులు అంతంత మాత్రంగానే ఉండడంతో రెండ్రోజుల నుంచి చేబదులు కూడా పుట్టడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంపిణీ చేసిన ఆహార నిల్వలు దాదాపు అన్ని సెంటర్లలో నిండుకున్నాయని, పలు కేంద్రాల్లో ఉన్న నిల్వలు మరో మూడు, నాలుగు రోజులకు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు. గర్భిణులు, బాలింతలకు నిత్యం 200 మిల్లీలీటర్ల పాలు అందించాల్సి ఉండగా, దానికి ఎగనామం పెట్టారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 777 అంగన్వాడీ కేంద్రాలుండగా, అత్యధిక కేంద్రాల్లో వారం, పది రోజుల నుంచి పాలు పంపిణీ చేయడం లేదని చెబుతున్నారు.
ఫుడ్ సెక్యురిటీ యాక్టును అనుసరించి 45 రోజులకు సరిపడా ఆహార పదార్థాలను ముందుగానే కేంద్రాల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే, సరుకుల నిల్వలపై సంబంధిత అధికారులకు సమాచారమిచ్చినా, పెద్దగా స్పందించడం లేదని తెలుస్తున్నది. కాగా, సరుకుల సరఫరాకు సంబంధించి ఒప్పంద గడువు ముగియడంతోనే కొరత వేధిస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో గడువు ముగిస్తే, పునః ఒప్పందం జరిగే వరకు అప్పటిదాకా సరఫరా చేసిన సంస్థ నుంచే తాత్కాలికంగా పాల ప్యాకెట్లు కొనుగోలు చేసేది. అయితే ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. పాల పంపిణీ నిలిచిపోయినా స్పందన కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రస్తుత పాల సరఫరా ఏజన్సీని ఉంచుతుందా..? కొత్త ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంటుందా..? అనేది తెలియాల్సి ఉన్న ది. ఒకవేళ కొత్త సంస్థతో ఒప్పందం చేసుకుంటే అది పూర్తయి అనుమతులు రాగానే పాల సరఫరా మొదలవుతుంది. ఇదే విషయాన్ని స్థానిక అధికారులు చెబుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా నిలిచిపోవడంపై ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రతి రెండు నెలలకోసారి ఇండెంట్ పెట్టాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరికి సంబంధించి ఇప్పటికే పంపాం. కొన్ని జిల్లాలకు బుధవారం నుంచి పంపిణీ ప్రారంభించే అవకాశం కనిపిస్తున్నది. కరీంనగర్ జిల్లాకు కూడా త్వరలోనే పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
– ఎం సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి (కరీంనగర్)