Mannempally | తిమ్మాపూర్, డిసెంబర్20: భీకర యుద్ధ సన్నివేశాన్ని తెలిపే శిల్పం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో కరణాల గడీల వద్ద ఉన్న పాలకేంద్రం ప్రాంగణంలో బయటపడింది. గ్రామానికి చెందిన పోతుగంటి సంపత్ చెట్లపొదలు శుభ్రం చేస్తుండగా ఒక వీరగల్లు శిల్పం బయటపడిందని, చరిత్ర పరిశోధకుడు ‘డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి’ తెలిపారు.
ఒకటిన్నర ఫీట్ల ఎత్తులోనే నల్లసరం బండపై శిల్పం అద్భుతంగా చెక్కబడింది. ఈ శిల్పంలో దిగువన ఒక సైనికుడు కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో కళ్లెం పట్టుకుని గుర్రం ముందరి కాళ్లతో శత్రు సైనికుడిని పడగొట్టగా, మరొక సైనికుడు ఏనుగుపై ఉన్నాడు. యుద్ధ సన్నివేశాన్ని తెలిపే గొప్ప శిల్పమని చెప్పవచ్చు.
యుద్ధంలో మరణించిన వీరుడు స్వర్గస్తుడయ్యాడని తెలపడానికి పైన అసీనుడైన శిల్పం ఉంది. శిల్ప శైలిని బట్టి వేములవాడ చాళుక్యుల కాలం నాటిదని తెలుస్తోంది. ఎన్నో ఏళ్ళుగా పూజలు అందుకున్న ఈ శిల్పాన్ని గుడి ప్రాంగణంలో నిలబెట్టాలని పరిశోధకుడు గ్రామస్తులకు సూచించారు.