వీర్నపల్లి, ఫిబ్రవరి 2 : రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కూలీ పని దొరికితేనే బిడ్డలకు కడుపు నిండా భోజనం. ఈ పరిస్థితిలో అనారోగ్యం పాలైన ఒక్కగానొక్క కొడుక్కు మెరుగైన వైద్యం చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్తం కోసం ఎదురుచేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బావుసింగ్నాయక్తండాకు చెందిన ఓ గిరిజన దంపతులు. గ్రామానికి చెందిన బట్టు భారతి, సంతోష్ది నిరుపేద కుటుంబం. వారికి ఇద్దరు కూతుళ్లు హారిక, అశ్విని, కొడుకు విశాల్ ఉన్నారు. ఇటీవల విశాల్కు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్లలోని ఓ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అపెండెక్స్గా నిర్దారించి, అపరేషన్ చేశారు.
అయినా, కడుపు ఉబ్బడంతో విశాల్ ఇబ్బందులు పడుతూ మంచానికే పరిమితమయ్యాడు. ఊపిరితిత్తుల్లో వాపు వచ్చి రోజురోజుకూ పరిస్థితి విషమించింది. దీంతో కరీంనగర్కు తరలించాలని వైద్యులు సూచించడంతో అక్కడికి తీసుకెళ్లారు. రోజుకు రూ.30 వేలు ఖర్చవుతాయని వైద్యులు తెలుపడంతో ఖరీదైన వైద్యానికి చేతిలో చిల్లిగవ్వలేక బాలుడి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే తమ కొడుకును బతికించుకుంటామని వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు బట్టు సంతోష్ 9704155325కు ఫోన్ పే, గూగుల్ పే చేయాలని కోరుతున్నారు. కాగా, విశాల్ ఇదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతుండగా, అతని పరిస్థితి తెలుసుకుని ఇన్చార్జి హెచ్ఎం సందవేణి రామాకాంత్ తను సాయం చేయడంతో పాటు మిత్రుల సహకారంతో రూ.20 వేల చందాలు జమ చేశారు. ఈ నగదును కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు తెలిపారు.