కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మానకొండూర్ ఎమ్మెల్యే అసలు పీఏను నేనే’ అంటూ ఓ వ్యక్తి చెలామణి అవుతూ.. వివిధ వర్గాల నుంచి వసూళ్లకు దిగుతూ.. దందాలు నడిపిస్తున్న తీరుపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘షాడో ఎమ్మెల్యే’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. నియోజకవర్గంలో ప్రకంపనలు రేపింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతోపాటు ప్రతి చోటా ఆ ‘షాడో ఎమ్మెల్యే’పై చర్చ జరిగింది. ప్రజలతోపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ అంతర్గతంగా చర్చ సాగింది. ‘నమస్తే తెలంగాణ’ వాస్తవాలను బయట పెట్టిందని, సదరు పీఏ అక్రమాలు మరిన్ని ఉన్నాయంటూ కొంతమంది ‘నమస్తే’కు ఫోన్ చేశారు. సదరు పీఏ ఏయే వర్గాల నుంచి ఎలా వసూలు చేస్తున్నారో వివరిస్తూ ‘నమస్తే తెలంగాణ’ కండ్లకు కట్టినట్టుగా కథనం ప్రచురించింది.
తిమ్మాపూర్ మండలం మోయతుమ్మెద వాగు నుంచి కొత్తపల్లి, రేణిగుంట పరిధిలో నుంచి కొంతమంది ఇసుకను తీసుకొని విక్రయిస్తుండగా.. ఒక్కో ట్రాక్టర్ నుంచి నెలకు రూ.పదివేలు ఇవ్వాలంటూ వసూళ్లకు పాల్పడిన విషయాన్ని బహిర్గతం చేసింది. దీంతో ఉలికిపడ్డ సదరు పీఏ.. ఈ మరకలు తుడిచి వేసుకునేందుకు కొత్తపల్లికి చెందిన కొంతమంది ట్రాక్టర్ యజమానుల నుంచి వసూలు చేసిన డబ్బులను బుధవారం వాపస్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
దాదాపు ఎనిమిది మంది ట్రాక్టర్ల ఓనర్లకు పైసలు వాపస్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న రేణిగుంట ట్రాక్టర్ యజమానులు కూడా తమ వద్ద వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. కాగా, ఎమ్మెల్యే పేరు చెబుతూ సదరు పీఏ బాహాటంగానే వసూళ్లకు పాల్పడుతున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఏమైనా స్పందిస్తారేమోనని అందరూ భావించారు. కానీ, ఈ విషయంలో ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. దీనిపైనా ప్రస్తుతం నియోజకవర్గంలో భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి.