జగిత్యాల అర్బన్, మే 29: ‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ భాగోతం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో సోమవారం ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కలెక్టర్, అదనపు కలెక్టర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇటు బాధితుల ఫిర్యాదుతో జిల్లా పోలీస్ అధికారులు చర్యలు సిద్ధమయ్యారు. భూ కబ్జాకు యత్నించిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఏకంగా స్పెషల్ బ్రాంచ్ అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో విచారణ చేపట్టారు. రికార్డులను పరిశీలించారు.
పట్టణ పోలీసులు కూడా వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భూకబ్జా యత్నం, అసెస్మెంట్ కాపీ తయారీపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి కలెక్టర్ యాస్మిన్ భాషాను బుధవారం రాత్రి కలిసి వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ సిబ్బంది, అధికారుల ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భూభాగోతం కథనంతో మున్సిపాలిటీలో గతంలో జరిగిన అవకతవకలపై సైతం చర్యలు మొదలు కావడంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతున్నది. పలువురు బాధితులు తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.