కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 27 : ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండగా, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉదయం 9 నుంచి 12 గంటలకు వరకు పరీక్షలు జరగనుండగా, నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 67,738 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వీరి కోసం 127 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. కాగా, కరీంనగర్ జిల్లాలో ప్రథమ 16,590 మంది, ద్వితీయ 16,959 మంది చొప్పున మొత్తం 33,549 మంది విద్యార్థులు ఉండగా, వీరికోసం 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ప్రథమ 5213 మంది, ద్వితీయ 5891 మంది చొప్పున మొత్తం 11,104 మంది ఉండగా, వీరికోసం 24 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రథమ 4609 మంది, ద్వితీయ 3934 మంది చొప్పున మొత్తం 8,543 మంది పరీక్ష రాయనుండగా, వీరి కోసం 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 14,542 మంది పరీక్ష రాయనుండగా, వీరి కోసం 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు.