SRIDHAR BABU |పెద్దపల్లి, మార్చి 29(నమస్తే తెలంగాణ): చట్టానికి లోబడి అధికారులంతా జవాబు దారి తనంతో పని చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి కమాన్ పూర్ మండలంలో రూ. 50 లక్షల డీఎంఎఫ్టిటీ నిధుల వ్యయంతో చేపట్టిన తహసిల్దార్ భవన నిర్మాణం, రామగిరి మండలంలో నూతనంగా తహసిల్దార్ కార్యాలయం నిర్మించడానికి రూ. 65 లక్షలు, రామగిరి కేజీబీవీ పాఠశాల అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ. 67 లక్షలు, నియోజకవర్గ కేంద్రమైన మంథని ఆర్డీవో కార్యాలయం వద్ద రూ.4.5 కోట్ల డిఎంఎఫ్టి నిధులతో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణం, బాలికల ఉన్నత పాఠశాల రేనోవేషన్ కోసం రూ. 30 లక్షలు, ముత్తారం కస్తూర్బా కేజీబీవీ పాఠశాల కోసం 35 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు అయన శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాల నిర్మాణ పనులను ప్రజా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉన్న సమస్యలను చట్ట ప్రకారం పరిష్కారానికి కృషి చేయాలని, అధికారులలో జవాబుదారితనం తీసుకుని రావడానికి చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థ వల్ల జరిగిన నష్టాలను భూ భారతి చట్టంతో పూడ్చెందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని అన్నారు. చట్టానికి లోబడే మాత్రమే అధికారులంతా పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
మండల కేంద్రాలలో కూడా కార్యాలయాలు అంతా ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా అనువైన స్థలాలను ఎంపిక చేయాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. కుమార్ పూర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కార్యాచరణ చేపడతామని, దీనికి ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని మంత్రి కోరారు. షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. పాఠకుల కోసం ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయం నిర్మిస్తామని అందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రతి రోజూ కమాన్ పూర్ మండలంలో వేలాది మహిళలు వినియోగించు కుంటున్నారని అన్నారు.
మహిళలకు రూ. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతులకు 2 లక్షల రుణ మాఫీ, రూ. 500 రూపాయల బోనస్ అందించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఉగాది నుండి రేషన్ కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయనున్నామని అన్నారు. రైతులకు ఒక గింజ కూడా తాళ్ళు కట్ చేయకుండా మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు.
ఉద్యమ సమయంలో కూడా కమాన్ పూర్ మండలానికి జూనియర్ కళాశాల, జేఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ, 130/32 సబ్ స్టేషన్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. కమాన్ పూర్ మండలం తో పాటు రామగిరి, ముత్తారం మండలాల్లో కూడా నూతన తహసిల్దార్ కార్యాల భవనాలను నిర్మిస్తున్నామని, మంథని లో డివిజన్ కు సంబంధించిన అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ లు పంచాయతీరాజ్ ఎస్ఇ కే చక్రవర్తి పీఆర్ ఈఈ గిరీష్ బాబు, డిఈ నవీన్ కుమార్ లతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.