కలెక్టరేట్, మే 29 : రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన పాప అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన పీతల అక్ష 2016లో తన తండ్రి రవికుమార్తో కలిసి కనిపించకుండా పోయి, ఎట్టకేలకు సోమవారం తల్లిదండ్రుల ఒడికి చే రింది. చిన్నారికోసం వచ్చిన తల్లిదండ్రుల్లో పాప తన తండ్రిని గుర్తించగా, తన కూతురేనం టూ వచ్చిన తల్లి తన భార్యేనని అంగీకరిస్తూ తగిన ఆధారాలు చూపడంతో, అధికారులు పరిశీలించి ధ్రువీకరించారు. తూర్పు గోదావరి జిల్లా పోలీస్ శాఖ కూడా పాప తల్లి ఫిర్యాదు చేసింది వాస్తవమేనంటూ, తల్లి ద్వారకకు పాపను అప్పగించాలంటూ జిల్లా సీడబ్ల్యూసీకి లిఖితపూర్వకంగా కోరగా, ఆ జిల్లాలోని బాలల సంరక్షణ కమిటీ వద్దకు చేర్చి, వారి ద్వారా తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్కెపల్లి గ్రామంలో కొద్ది రోజుల క్రితం భాగ్యలక్ష్మి అనే మహిళ వద్ద తొమ్మిదేళ్లపాప ఉండగా, గమనించిన ఇరుగు పొరుగు ప్రజలు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో పాప తల్లి పీతల ద్వారక అలియాస్ డోక్రాతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవిచంద్రన్ అనే వ్యక్తి తమ పాపేనం టూ ఇటీవల సీడబ్ల్యూసీకి వచ్చారు. వీరిని తగిన ఆధారాలు చూపాలంటూ అధికారులు కోరగా, తన వద్ద ఏ ఆధారం లేదంటూ రవిచంద్రన్ తిరిగి వెళ్లిపోయాడు. ద్వారక మాత్రం తన భర్త పాపను తీసుకుని ఎటో వెళ్లిపోయాడని, తాను సఖినేటిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన తన పాప ఫొటో చూసి గుర్తుపట్టి వచ్చినట్లు పేర్కొన్నా అధికారులు మాత్రం బలమైన ఆధారాలు చూపాలంటూ స్పష్టం చేశారు.
మరోవైపు పాపను సంరక్షిస్తున్న భాగ్యలక్ష్మిని నిజానిజాలు చెప్పాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంతో, తాను ఉద్యోగం కోసం పుణేకు వెళ్లిన సందర్భంలో పాప తండ్రి పీతల రవికుమార్ తన కూతురిని అప్పగించాడని వెల్లడించగా, కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడిం ది. దీంతో, పోలీసులు ఆమె వద్ద నుంచి అతడి ఫోన్ నంబర్ తీసుకుని ఆరాతీయగా వాస్తవేమనంటూ అంగీకరించినట్లు అధికారులు తెలిపా రు. పాప అక్షకు సంబంధించిన ఆధార్కార్డు, పుట్టినరోజు ధ్రువీకరణపత్రం, పుట్టిన స్థలం, తదితర వివరాలు కూడా పంపడంతో సీడబ్ల్యూసీ సిబ్బంది సంబంధిత అధికారుల ద్వా రా వివరాలు సేకరించగా వాస్తవాలేనని తేలినట్లు బాలల సంరక్షణ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి స్పష్టం చేశారు. పుణె నుంచి వచ్చిన తండ్రిని చూసిన పాప ఉద్వేగానికి లోనై, తన ను ఇంటికి తీసుకెళ్లమంటూ రోదించడం కూడా వాస్తవాన్ని బహిర్గతం చేసిందన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాప అక్షను తూ ర్పుగోదావరి జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారుల వద్దకు చేర్చి, వారి ద్వారా తల్లిదండ్రులకు అప్పగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎడబాటుకు గురై తమ స్వస్థలమైన సఖినేటిపల్లి నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లగా, రవికుమార్ పాపతోపాటు పూణేకు వెళ్లి ఓ వృ ద్ధాశ్రమంలో వంటమనిషిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం కోసం పత్రికలో వచ్చిన ప్ర కటన చూసి పూణేకు వెళ్లిన భాగ్యలక్ష్మికి రవికుమార్ పరిచయం కాగా, తన ఇంటికి వస్తున్న సందర్భంలో తన కుమార్తెను కూడా తీసుకెళ్లమంటూ చెప్పడంతోనే తన వెంట తీసుకెళ్లినట్లు రవికుమార్ వెల్లడించగా, అనుమానాలకు తెరపడింది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల తో ఏడేళ్లు కలుసుకోలేని తాము పాప అక్ష మూ లంగా తిరిగి ఒక్కటయ్యామని తల్లిదండ్రులు రవికుమార్, ద్వారక సంతోషంతో చెప్పారు.
బాగా చదువుకో.. ఉన్నత స్థాయికి ఎదుగు
తల్లి లేని బాధను ఇన్నాళ్లు అనుభవించావ ని, ఇక నుంచి తల్లిదండ్రులతో ఆనందంగా గ డుపుతూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎ దగాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చిన్నారి అక్షను ఆశీర్వదించారు. అక్ష జిల్లా అధికారుల కృషితో సో మవారం తల్లిదండ్రుల చెంతకు చేరగా, జిల్లా బాలల సంరక్షణ అధికారులు వీరిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాపతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం చిన్నారి అక్ష కు చాక్లెట్లు, పెన్ను, పుస్తకం బహూకరించారు. పాపను తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో కృషి చేసిన అధికారులను అభినందించారు. ఇక్కడ జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి, సభ్యులు రెండ్ల కళింగశేఖర్, రాధ, అర్చన, విజయ్, డీ సీపీవో శాంత, పాప తల్లిదండ్రులు పీతల ద్వార క అలియాస్ డోక్రా, రవికుమార్ ఉన్నారు.