వీణవంక, ఫిబ్రవరి 11 : రేగుపండ్లు తెంపుతూ బావిలో పడి ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన ఈర్నాల శారద-శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక్కగానొక్క కొడుకు రాజు (12) ఉన్నారు. రాజు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఆడుకుంటూ మధ్యాహ్నం బయటకు వెళ్ళాడు.
సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఊరి చివరలోని బావిపక్కన ఉన్న రేగుచెట్టు వద్దకు వెళ్ళి చెప్పులు విడిచి పండ్లు తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. బాలుడు ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి సాయంత్రం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికారు. బావి పక్కన చెప్పులు విడిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు అందులో మంగళవారం రాత్రి వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం శవమై కనిపించగా.. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు.