DOST Admission 2023 | డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచే మొదలుకాబోతున్నది. అందుకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు మొదటి విడుత రిజిస్ట్రేషన్లకు అవకాశమిచ్చింది. మొత్తం మూడు విడుతలుగా ప్రవేశాలను చేపట్టి, వచ్చే జూలై 10న సీట్ల కేటాయింపుతో ముగించి, 17 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభించనున్నది. అయితే కొన్నేళ్లుగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న సీట్లలో దాదాపు సగం ఖాళీగానే ఉంటుండగా, ఈ సారి ప్రవేశాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొన్నది. కాగా, ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఏ కాలేజీలో ఎన్ని సీట్లకు అనుమతి ఉందన్న విషయాన్ని ఈ రోజు విశ్వవిద్యాలయ యంత్రాంగం ప్రకటించనున్నది.
కరీంనగర్, మే 15 (నమస్తే తెలంగాణప్రతినిధి)/కమాన్చౌరస్తా : రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం చూస్తే.. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మొదటి విడుత ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశమున్నది. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్స్కు చాన్స్ ఉండగా, జూన్ 16న మొదటి విడుత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది. తిరిగి జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రెండో విడుత ఆప్షన్ల ప్రక్రియ, 30న రెండో విడుత సీట్ల కేటాయింపు, జూలై 1 నుంచి జూలై 6 వరకు మూడో విడుత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, 10న మూడో విడుత సీట్ల కేటాయింపు ఉండనున్నది. జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు విడుతలుగా అవకాశమిచ్చి సీట్లను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అవకాశమిచ్చింది.
నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల వివరాలను సంబంధిత అధికారులు మంగళవారం వెల్లడించనున్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఇప్పటికే అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. గతేడాది విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలలు, అందులో నిండిన సీట్లు, ప్రస్తుతం ఏ కళాశాల ఏ కోర్సులో ఎన్ని సీట్లు కావాలని కోరుకుంటుందన్న వివరాలను సేకరించారు. అంతేకాదు, కొన్ని కాలేజీలను కొనసాగించాలా..? లేదా..? అన్న విషయాన్ని సైతం పరిశీలించి, సదరు నివేదికను వీసీ ముందు పెట్టారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత అనుమతి ఉన్న కాలేజీలు, సదరు కాలేజీలకు కేటాయించిన సీట్ల వివరాలు ఈ రోజు వెల్లడించనున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు కొన్ని కాలేజీలను మూసివేసేందుకు ఆమోదం కోరినట్టు తెలుస్తున్నది.
విద్యార్థులు దోస్త్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే అవకాశమున్నది. నచ్చిన, అందుబాటులో ఉండే యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అందుకోసం విద్యార్థులు ముందుగానే తమ ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. టీ-యాప్ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్ కాగానే వారికి దోస్త్ ఐడీ, పిన్ నంబరు వస్తుంది. వీటిని ఉపయోగించి దరఖాస్తు పూర్తి చేసుకోవా లి. అందులో కోర్సులు, కాలేజీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కళాశాలకు వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేసేందుకు కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలతోపాటు జమ్మికుంట, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దోస్త్ సేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేకంగా అధ్యాపకులను ఉంచి సహకారం అందిస్తున్నారు. విద్యార్థులు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే తమకు నచ్చిన కోర్సు, కాలేజీ ఎంపిక చేసుకోవడంతోపాటు రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా తప్పులు జరిగినా సరిదిద్దుకునే అవకాశమున్నది.
నిజానికి 2016కు ముందు కొన్ని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఫీజురీయింబర్స్మెంట్ కోసం అడ్డదారులు తొక్కాయి. విద్యార్థుల సంఖ్య నిండుగా ఉన్నట్టు చూపించాయి. ఈ తరహా బోగస్ అడ్మిషన్లకు కల్లెం వేయడంతోపాటు అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ప్ర భుత్వం భావించింది. ఆ మేరకు అన్ని డిగ్రీ కాలేజీల్లో సీట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచి, వాటిని ఆన్లైన్ ద్వారా భర్తీ చేసేందుకు 2016 నుంచి ‘దోస్త్’ను అమల్లోకి తెచ్చింది. దీంతోపాటు శాతవాహన విశ్వవిద్యాలయ అధికారులు సైతం బోగస్ విద్యార్థులు, నమోదు ప్రక్రియ వంటి అంశాలపై నిశిత పరిశీలన చేసి పలుచర్యలు తీసుకున్నారు. దీంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య త గ్గుతూ వస్తున్నది. నాలుగేళ్లుగా యూనివర్సిటీ పరిధిలో ఉన్న సీట్లలో దాదాపు యాభైశాతం మాత్ర మే ప్రవేశాలు జరుగుతున్నాయి. 2022-23 వి ద్యాసంవత్సరానికి సంబంధించి చూస్తే.. ఎస్ యూ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 90 కాలేజీలు ఉండగా, 42,020 సీట్లు ఉన్నాయి. అందు లో 20,218 సీట్లు భర్తీ ఆయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లో 4,364 సీట్లు భర్తీకాగా, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 460, ట్రైబల్ వెల్ఫేర్లో 266, బీసీ వెల్ఫేర్లో 18పోను ప్రైవేటులో 15,110 సీట్లు భర్తీ అయ్యాయి. ఏటా సగం శాతంలోపే సీట్లు నిండుతున్న తరుణంలో ఈ సారి ప్రవేశాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొన్నది.
గతంలో మాదిరిగానే వేగంగా దోస్త్ సైన్ ద్వారా విద్యార్థులకు సేవలందించేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా విద్యార్థులకు ఉచితంగా సేవలం దిస్తున్నాం. వెబ్ ఆప్షన్ల పెట్టుకునే క్రమంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యూనివర్సిటీలకు అనుబంధంగా కళాశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు, అధ్యాపకులు, కోర్సులు పరిశీలించి కళాశాల ఎంపిక చేసుకోవాలి.
– డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ, ఎస్సారార్ కాలేజీ ప్రిన్సిపాల్
కరీంనగర్లోని జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో దోస్త్ సేవా కేంద్రం ద్వారా విద్యార్థులకు ఉచితంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందులో రిజిస్ట్రేషన్తోపాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కూడా విద్యార్థుల ఇష్టానుసారం అందిస్తాం. విద్యార్థులు సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో తప్పులు జరిగితే, ఈ కేంద్రాలకు వచ్చి సవరించుకునే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఈ కేంద్రం పని చేస్తుంది.
– శ్రీనివాస్, దోస్త్ కోఆర్డినేటర్