అది సన్నకారు రైతు కుటుంబం. వారికి ఎనుకటి నుంచి వచ్చిన ఎకరం వ్యవసాయ భూమే జీవనాధారం. నిత్య ఆదాయం వచ్చే కూరగాయలు పండిస్తూ రోజూ మార్కెట్కు వెళ్లి అమ్ముకొని వస్తూ ఇల్లు గడుపుకునే పేద కర్షకుడి బిడ్డకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. పాఠశాల విద్య నుంచే చదువుల్లో టాపర్గా నిలుస్తూ వచ్చిన శనిగరం అపరంజి నీట్లో సత్తా చాటింది. రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన జిల్లాకో మెడికల్ కాలేజీతో రామగుండం కళాశాలలో అడ్మిషన్ తీసుకోగా, తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
– పెద్దపల్లి, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ)
మా అత్తమ్మ సరిత, అన్నయ్య చిన్నప్పటి నుంచి బాగా చదవాలని ప్రోత్సహించే వారు. అమ్మా, నాన్నలు మాకోసం పడుతున్న ప్రతి కష్టాన్ని చూసే దాన్ని. నేను బాగా చదవాలి. గొప్పగా జీవించాలనుకున్నా. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కాలేజీలు పెరుగుతుండడం, సీట్లు లభించే అవకాశాలు సైతం వస్తుండడంతో నీట్ వైపు ప్రయత్నం చేశా. అమ్మానాన్నలు తలో పని చేసుకుంటూ చాలా కష్టపడి చదివించారు. నేను అలాగే చదివాను. గతేడాది రామగుండంలో కాలేజీ ప్రారంభించడంతో ఇక్కడే సీటు సాధించాలని అనుకున్న. కష్టపడి సాధించా. సీఎం కేసీఆర్ చొరవతో ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం దక్కింది. సో.. అయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మై పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. ఐయామ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఐయామ్ ప్రౌడ్టూ బీ యాన్ ఎంబీబీఎస్ స్టూడెంట్.
– శనిగరం అపరంజి, ఎంబీబీఎస్ విద్యార్థిని, రేగడిమద్దికుంట, సుల్తానాబాద్ మండలం.
పెద్దపల్లి, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన శనిగరం సదానందం-భాగ్యలక్ష్మి దంపతులది సాధారణ రైతు కుటుంబం. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే సదానందానికి ఊళ్లో ఎకరం భూమి మాత్రమే ఉంది. వరి, ఇతర పంటలు వేస్తే ఇల్లు గడవదని, ఎన్నోఏండ్లుగా నిత్యం ఆదాయం ఇచ్చే కూరగాయలు పండిస్తున్నాడు. రోజు తప్పించి రోజు వాటిని తెంపి అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితమే తన పొలం పక్కనే ఉన్న మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఉన్నంతలో పిల్లలను చదివిస్తున్నాడు. ప్రస్తుతం కొడుకు అభిరామ్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా, కూతురు అపరంజి రామగుండం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరింది.
గ్రామంలోని వివేకానంద స్కూల్లో ఒకటి నుంచి ఐదో తరగతి దాకా చదివిన అపరంజి, ఆరు నుంచి పదో తరగతి దాకా ఎల్కతుర్తిలోని గురుకుల బాలికల వసతి గృహంలో చదివింది. పదో తరగతిలో 10/10 మారులు సాధించింది. ఇంటర్మీడియెట్ కరీంనగర్లోని ప్రైవేట్ కాలేజీలో చదివి 975 మారులతో టాపర్గా నిలిచింది. నీట్లో తొలి ప్రయత్నంలో 274మార్కులు సాధించిన అపరంజి, మరో మారు ప్రయత్నించి 481మార్కులతో ఎంబీబీఎస్లో సీటు దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోనే తన కూతురుకు ఎంబీబీఎస్లో సీటుదక్కిందని తల్లిదండ్రులు శనిగరం సదానందం-భాగ్యలక్ష్మీ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుట్టి పెరిగిన జిల్లాలోనే ప్రాథమిక, ఉన్నత విద్యలను పూర్తి చేసుకొని, ఇప్పుడు రామగుండం మెడికల్ కాలేజీలో వైద్య విద్యను సైతం కొనసాగించే అవకాశం రావడంపై అపరంజి సంతోషపడుతున్నది.
మాది చాలా పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. తల్లిదండ్రులు పడ్డ కష్టం నేను పడద్దు. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడద్దనుకున్న. అందుకనే పిల్లలను ఉన్నంతల మంచిగ చదివించిన. కొడుక్కు కూడా నీట్లో సీట్వచ్చేది కానీ అప్పుడు కరోనా కారణంగా చదువు ఇబ్బందైంది. ఇప్పుడు హన్మకొండల డిగ్రీ చదువుతున్నడు. ఇద్దరు పిల్లలను పెద్ద చదువులు చదివించాలంటే మాటలు కాదు. కానీ ఉన్న ఎకరానికి తోడు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని నేను నా భార్య కష్టపడి సాగు చేస్తున్నం. మా కష్టానికి తోడు పిల్లలు అచ్చినప్పుడల్లా చేన్ల, పొలంల సాయం అందించేటోళ్లు. మా కష్టం వృథా కాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నా బిడ్డకు ఎంబీబీఎస్ సీటు దక్కింది. రామగుండం మెడికల్ కళాశాలలో సీటచ్చింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నా బిడ్డ ఎంబీబీఎస్ చదువబోతున్నది. చాలా సంతోషంగా ఉంది.
నా బిడ్డ అపరంజి చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చదవాలనుకున్నది. వాళ్ల అత్తమ్మ, అన్నయ్య చాలా ప్రోత్సహించారు. అయితే ఎంబీబీఎస్ అన్నప్పుడల్లా నాకు చాలా భయం వేసేది. ఎంబీబీఎస్ అంటే 80-90లక్షలు అవుతయని వాళ్లు వీళ్లు అంటే చాలా అన్ని పైసలు ఎక్కడి నుంచి తేవాలని అనుకున్న. నా బిడ్డ ఈ ఎట్ల చదువుతదనే రంది పడేదాన్ని. కానీ సీఎం కేసీఆర్ వచ్చినంక మెడికల్ కళాశాలలు పెడుతాంటే నా బిడ్డకు కూడా సీటు వస్తదనే నమ్మకం కలిగింది. అంత ఖరీదైన ఆ చదువు నా బిడ్డకు ఉచితంగా అందుతున్నది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ చలవే. సార్ లేకపోతే మాలాంటోళ్ల పిల్లలకు ఎంబీబీఎస్ చదివే అవకాశం వచ్చునా. నిజంగా మా కుటుంబం సార్కు రుణపడి ఉంటది.