Korutla | కోరుట్ల, ఏప్రిల్ 18 : కోరుట్ల పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సముదాయంలో శనివారం మొదటి తరగతి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి రేణుక ప్రారంభించారు. ఈసందర్భంగా కోరుట్ల కోర్టుకు వచ్చిన న్యాయమూర్తికి ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసుల గౌరవ వందనాన్ని న్యాయమూర్తి స్వీకరించారు.
ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కోర్టులో తాను గతంలో న్యాయమూర్తిగా పని చేశానని చెప్పారు. జిల్లా ప్రజలతో మంచి అనుబంధం ఉందన్నారు. కోరుట్లలో అదనపు కోర్టు ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. కోరుట్ల శివారులో నూతనంగా నిర్మిస్తున్న కోర్టులో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని న్యాయమూర్తి చెప్పారు. కోరుట్ల కోర్టులో రెగ్యులర్ న్యాయమూర్తి నియామకానికి చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం కూచిపూడి నాట్యంతో అలరించిన విద్యార్థినిలకు న్యాయమూర్తి పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి సునీత రవీందర్రెడ్డి, మెట్పల్లి సబ్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు, జగిత్యాల సబ్ కోర్టు జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పావనీ, మెట్పల్లి సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అరుణ్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు, బార్ అసోసియోషన్ అధ్యక్షుడు తోట ఆంజనేయులు, ఏపీజీ గోనె రాజేష్ ఖన్నా, కోరుట్ల, మెట్ పల్లి, జగిత్యాల బార్ అసోసియోషన్ న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.