తిమ్మాపూర్ జోగయ్యపల్లిలో దారుణం
నిందితుల కోసం అన్వేషణ
తిమ్మాపూర్ రూరల్, జూలై4: తిమ్మాపూర్లోని జోగయ్యపల్లిలో దారు ణం జరిగింది. ఓ స్వామీజీ హత్య మండలంలో కలకలం రేపింది. భక్తుల ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు విచారణలో తేల్చారు. ఎస్ఐ ప్రమోద్రెడ్డి వివరాల ప్రకారం.. జోగయ్యపల్లిలో చిలుపూరి పెద్దన్న స్వామి(60) కొన్నేండ్ల కిందట హనుమాన్ ఆలయాన్ని నిర్మించి అందులోనే ఆశ్రమం ఏర్పాటు చేశాడు. అప్పటినుంచి నిత్యం వివిధ ప్రాంతాల ప్రజలు స్వామీజీని కలిసి సమస్యలు చెప్పుకునే వారు.
ఈ క్రమంలో ఇదే మాదిరి వరంగల్ జిల్లాకు చెందిన శివ తనకు ఇంటి సమస్య ఉందంటూ వచ్చి పరిష్కరించాలని కోరగా, పెద్దన్న పది రోజుల క్రితం శివ ఇంటికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో శివ మళ్లీ మూడు రోజుల కిందట తన స్నేహితుడు నీలం శ్రీనివాస్తో కలిసి వచ్చి కరీంనగర్లో పనిఉందంటూ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించాలని కోరగా, స్వామి ఒప్పుకున్నాడు. తిరిగి ఆదివారం ఉదయం స్వామి అతని డ్రైవర్ సతీశ్తో కలిసి బయటికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఇంకా వెళ్లలేదా..?అని వారిని స్వామి ప్రశ్నించగా ఉద యం వెళ్తామని సమాధానమిచ్చారు.
సోమవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు స్వామి అల్లుడు సతీశ్ ఆలయానికి రాగా.. స్వామి ఎంతకూ లేవకపోవడంతో భయంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆలయంలో నిద్రించిన ఇద్దరు వ్యక్తులు స్వామిని తాడుతో ఉరివేసి బలవంతంగా చంపారని ఆయన కొడుకు ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య జరిగిన ప్రదేశాన్ని కరీంనగర్ ఏసీపీ కరుణాకర్రావు, సీఐ శశిధర్రెడ్డి సందర్శించారు. భక్తులుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. నిందితుల కోసం అన్వేషిస్తున్నారు.