Centenary Colony | రామగిరి, ఫిబ్రవరి 23 : పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. బేగంపేట గ్రామానికి చెందిన మొలంగురి కొమురయ్య హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన బుర్ర కొమురయ్య అలియాస్ రాజ కొమురయ్యను అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ తెలిపారు. రామగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు బుర్ర కొమురయ్య సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. 2011లో అతడి కుమారుడు గుండారం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
ఆ ప్రమాదానికి తన బావ మొలంగురి సత్తయ్య, అతడి అన్న మొలంగురి కొమురయ్య కారణమని నిందితుడు భావిస్తూ వారిపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి వారిని హత్య చేయాలని పలుమార్లు యత్నించాడు. కాగా, ఇద్దరూ ఒకేసారి కనిపించకపోవడంతో అవకాశం రాలేదు. ఈ విషయంపై గతంలో పలుమార్లు గొడవలు కూడా జరిగి బాధితులను చంపుతానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 21న సెంటినరీ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో జరిగిన వివాహానికి సత్తయ్య, కొమురయ్య ఇద్దరూ తప్పకుండా వస్తారని భావించిన నిందితుడు ముందస్తుగా పథకం రచించాడు. తన బైక్పై ఇంటి నుంచి కత్తి తీసుకుని, తన కుమార్తెను పెళ్లి మండపం వద్ద దింపి బయట వేచి ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో బాధితులు హాల్ నుంచి బయటకు వస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. ముందుగా సత్తయ్యపై కత్తితో దాడి చేయగా అతడు అడ్డుకోవడంతో చేతిపై గాయాలయ్యాయి. అనంతరం అతడి సోదరుడు కొమురయ్యపై ఎడమ ఛాతీ భాగంలో బలంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి బైక్పై పరారైనట్లు ఏసీపీ తెలిపారు.
కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని కల్వచర్ల జీపీ పరిధిలోని మారుతి నగర్ హనుమాన్ గుడి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గోదావరిఖని టూ టౌన్ సీఐ ఎన్ ప్రసాద్రావు, రామగిరి ఎస్సై టీ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు బీ రాజ్కుమార్, అశోక్ను ఏసీపీ అభినందించారు.