పందొమ్మిదేళ్ల క్రితం ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలోనే మొదటగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ను నిర్మించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రభుత్వ విద్యాలయాలను తీర్చిదిద్దుతున్నామని, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. పెద్దసంఖ్యలో గురుకులాలను నిర్మించి ప్రతి విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని, వారిని ప్రపంచంతో పోటీ పడేలా తయారుచేస్తున్నామన్నారు. ‘మన ఊరు – మన బడి’లో భాగంగా గంభీరావుపేటలో రూ.11.50 కోట్లతో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ భవనాన్ని బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం క్యాంపస్లో లైబ్రరీ, డైనింగ్ హాల్, క్రీడామైదానాలను పరిశీలించి, ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. తదనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
సిరిసిల్ల/గంభీరావుపేట, ఫిబ్రవరి 1 : ఉద్యమ సమయంలో కేసీఆర్ గంభీరావుపేటలో ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలోనే ఆదర్శంగా కేజీ టూ పీజీ విద్యాలయాన్ని నిర్మించుకున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, అందులో భాగంగా విద్యా ప్రమాణాలు పెంచుతున్నామని చెప్పారు. ‘మనఊరు-మన బడి’లో భాగంగా 11.50కోట్లతో గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ భవనాన్ని బుధవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమమని, ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో 2004 సెప్టెంబర్ 17న అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ గంభీరావుపేట పర్యటనలో భాగంగా విద్యార్థులకు చదువు ఒకే చోట ఉండాలని, తెలంగాణ సాధించుకున్న తర్వాత కేజీ టూ పీజీ సంస్థలను ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి నేడు నెరవేర్చారని గుర్తు చేశారు. ఆయన హామీకి ప్రతి రూపమే గంభీరావుపేట కేజీ టూ పీజీ విద్యా సముదాయమని తెలిపారు.
విద్యాపరంగా అభివృద్ధి చెందిన దేశాలే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తూ విద్యాభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలో అనేక గురుకులాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విద్యార్థికి రూ.1.25 లక్షలు ఖర్చుపెడుతున్నామన్నారు. దేశంలోనే చిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణేనని, అయినా ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులు తీస్తున్నాయని వివరించారు. ప్రజల సర్వోతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే కొత్త సంస్కరణలు తెచ్చి, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజల చెంతకు పాలన తెచ్చారని తెలిపారు. సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లతో ఎన్నో పథకాలు అందిస్తూ ప్రజల పక్షపాతిగా నిలిచారని చెప్పారు.
విమర్శలు చేయడం సులభమే కానీ, పేదలకు పనులు చేసి వారి మనసును గెలుచుకోవాలని సూచించారు. తిరుపతి, షిరిడీ పుణ్యక్షేత్రాలను తలపించేలా కేజీ టూ పీజీ క్యాంపస్లో వెయ్యి మంది కూర్చుండి తినేవిధంగా పెద్ద డైనింగ్ హాల్ ఎర్పాటు చేశామన్నారు. రానున్న కాలంలో జిల్లాలో అన్నిరంగాల్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రగతి నివేదికలు సిద్ధం చేసి ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి చేతిలో పెడతామని చెప్పారు. పేదల కోసం కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ మంచి మనసున్న నాయకుడిగా మారారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషర్ వాకాటి కరుణ, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, డీఈవో రాధాకిషన్, సర్పంచ్, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలకు పెద్దపీట
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యాప్రమాణాలకు పెద్దపీట వేశారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. నిరంతరం అభివృద్ధి జరగాలనే అకుంఠిత దీక్షతో ముందుకెళ్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ మార్గదర్శకంగా పనిచేస్తున్నారు. వారికి నా అభినందనలు. ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేని విధంగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ విద్యాసంస్థల సముదాయాన్ని నిర్మించడం తెలంగాణకే స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని విజన్తో గొప్పగా నిర్మించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టి బడులను బలోపేతం చేస్తున్నారు. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు విధి విధానాలు రూపొందించాలి. నాణ్యమైన విద్యతోపాటు ప్రపంచంతో పోటీపడేలా డిజిటల్ బోధన అమలు చేస్తున్నారు. గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎల్ఎల్బీ వంటి ఉన్నత విద్యను అందిస్తున్నాం. వీటితో పాటు విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు ఓవర్సీస్ పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గంభీరావుపేటలో ఏర్పాటు చేసిన కేజీ టూ పీజీ వంటి క్యాంపస్లను రాష్ట్రంలో విస్తరిస్తం. ఈ క్యాంపస్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
– విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నెరవేరుతున్న సీఎం కేసీఆర్ కలలు
ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కన్న కలలు స్వరాష్ట్రంలో నెరవేరుతున్నాయి. తెలంగాణ రాక ముందు ఎన్నో రకాల నష్టపోయాం. నాడు గంభీరావుపేట పర్యటనలో కేసీఆర్ ప్రకటించిన మాదిరిగా కేజీ టూ పీజీ ఏర్పాటు చేయాలనే కల నేడు నెరవేరింది. పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా గుర్తింపు పొందుతున్నది. సీఎం కేఈఆర్ తెలంగాణను దేశానికే రోల్మాడల్గా తీర్చిదిద్దుతున్నారు.
– నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
ఈ ప్రాంత విద్యార్థులకు గొప్ప వరం
రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో గంభీరావుపేట మండలం ఉన్నది. ఈ ప్రాంత పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్ని సుందరంగా నిర్మించారు. మంత్రి కేటీఆర్కు ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు రుణపడి ఉంటారు. బంగారు తెలంగాణకు నిదర్శనంగా ప్రభుత్వ విద్యాలయ ప్రాంగణం ఉన్నది.
– కటకం శ్రీధర్, సర్పంచ్ (గంభీరావుపేట)