జూలపల్లి, నవంబర్ 15: యాభై ఎండ్లు అధికారమిస్తే అభివృద్ధి చేసే సోయిలేని కాంగ్రెస్ను బొందపెట్టాలని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలంటూ అబద్ధాల హామీలతో ముందుకువస్తున్న ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మి ఆగంకావద్దని, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి తనను ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. మండలంలోని అబ్బాపూర్, నిమ్మపల్లిలో బుధవారం ఈశ్వర్ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చి డప్పు చప్పుళ్ల మధ్య ఈశ్వర్కు ఘన స్వాగతం పలికారు. బొట్టుపెట్టి మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే భవిష్యత్లో కష్టాలు తప్పవని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల వృత్తులకు జీవం పోసి ఆదుకున్న ఏకైక సీఎం కేసీఆరేనన్నారు. పదేండ్ల ప్రభుత్వ పనితీరు, అభివృద్ది, సంక్షేమ ఫలాలు చూసి మూడోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ నిరంతరంగా కొనసాగిస్తామనీ, అధికారం చేపట్టిన వెంటనే ధర్మపురి నియోజక వర్గంలో 20 వేల మందికి పథకం మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ముదిరాజ్లకు ఉచిత చేప పిల్లలు, రాయితీపై వాహనాలు, పరికరాలు అందించి భరోసా కల్పించామని తెలిపారు. నాడు చేతినిండా పనిలేక చాలా మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, నేడు అట్లాంటి పరిస్థితి లేదన్నారు. ఉరిసిల్లను సిరిగల సిరిసిల్లగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
రైతు సంక్షేమం కోసం భారీ ప్రాజెక్టులు, ఉచిత కరెంట్, పంటల పెట్టుబడి, రైతు బంధు, రైతు బీమా అం దించి వ్యవసాయ రంగాన్ని పండుగలా తీర్చిదిద్దామని వివరించారు. మరోసారి కారు గుర్తుకు ఓటే సి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కాగా నిమ్మపల్లిలో ఇటీవల పాము కాటుతో మృతి చెందిన చొప్పరి నర్సింగం కుటుంబాన్ని ఈశ్వర్ పరామర్శించి ఓదార్చారు. అలాగే బీజేపీ నుంచి అబ్బాపూర్ మాజీ సర్పంచ్ బొడిగె లక్ష్మీనారాయణతోపాటు దాదాపు 200ల మంది బీఆర్ఎస్లో చేరా రు. వీరికి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ జిల్లా గ్రం థాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, జూలప ల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, మేడారం, పత్తిపాక సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకటరెడ్డి, సర్పంచ్ ఈర్ల మల్లేశం, ఎంపీటీసీ సభ్యులు దండె వెంకటేశం, తమ్మడవేని మల్లేశం, ధర్మారం ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి,నాయకులు శాతళ్ల కాంతయ్య, పసునూటి శ్రీనివాస్, గాండ్ల చంద్రయ్య, జంగం సతీశ్, కచ్చు బీరయ్య, గన్ను మహేందర్రెడ్డి, నిట్టు కొమురయ్య, గన్ను నర్సింహారెడ్డి, భూమల్ల నరేశ్, గాండ్ల చంద్రమౌళి పాల్గొన్నారు.