కోనరావుపేట, ఫిబ్రవరి 11: ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని, భార్యా పిల్లలు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనుకున్నాడు. వారంలోనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఒంట్లో బాగాలేదని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళితే వైద్యం వికయింటించి మృత్యుఒడికి చేరిన ఘటన కోనరావుపేట మండలం కొండాపూర్ హనుమాన్ తండాలో విషాదాన్ని నింపింది.
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్తండాకు చెందిన లకావత్ గోపాల్, హంస దంపతులకు కూతురు, ఇద్దరు కొడుకులు రాజు, తిరుపతి ఉన్నారు. పెద్ద కొడుకు రాజు గల్ఫ్ దేశంలో ఉన్నాడు. చిన్న కొడుకు లకావత్ తిరుపతి (34) సైతం ఎనిమిదేండ్లపాటు ఉపాధి కోసం కత్తార్ దేశం వెళ్లివచ్చాడు. ఇంటి వద్దే కొన్నేండ్లుగా కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే అనుకున్నట్లు పనిదొరక్కపోవడంతో మళ్లీ గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరో వారం రోజుల్లో ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు.
ఇంజెక్షన్ వికటించిందని..
వారంలో ప్రయాణం పెట్టుకున్న తిరుపతి కాస్త అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం నిమ్మపల్లిలోని ఆర్ఎంపీ వైద్యుడు చేపూరి ప్రసాద్ వద్దకు వెళ్లాడు. పరీక్షించి ఇంజెక్షన్ వేయగా, కొద్ది క్షణాల్లోనే తిరుపతి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. ఆర్ఎంపీ వెంటనే తిరుపతిని కారులో సిరిసిల్లలో దవాఖానకు త రలించాడని, అప్పటికే తిరుపతి మృతిచెందిన ట్లు చెప్పారు. తిరుపతికి కొడుకు సందీప్ ఉండగా, భార్య భారతి తొమ్మిది నెలల నిండు గర్భిణి.
మృతదేహంతో ఆందోళన
తిరుపతి మృతిచెందడంతో బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో కొలనూర్ శివారులో చందుర్తి సీఐ కిరణ్కుమార్, సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్, ఎస్ఐ రమాకాంత్ అడ్డుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, తండావాసులు తిరుపతి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. దాదాపు మూడుగంటల పాటు ధర్నా చేయగా, పోలీసులు ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవడంతో పాటు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. కాగా, అటు సిరిసిల్ల దవాఖాన వద్దా కాసేపు హైడ్రామా నడిచింది.
ఆర్ఎంపీ క్లీనిక్ సీజ్
లకావత్ తిరుపతి వైద్యం వికటించి మృతిచెందడంతో జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు చర్యలు చేపట్టారు. నిమ్మపల్లిలోని ఆర్ఎంపీ వైద్యుడు ప్రసాద్ క్లినిక్ను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా మెడికల్, క్లినిక్ షాపులను నడిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వైద్యాధికారి వేణుమాధవ్, సూపర్వైజర్ పాషా, ఏఎన్ఎంలు ఉన్నారు.