జగిత్యాల టౌన్, ఆగస్టు 23: హైదరాబాద్లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్లిన ఓ యువకుడు టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలుగుచూసింది. కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన పోతుగంటి చంద్రశేఖర్ జూన్ 24న హైదరాబాద్లోని గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య పరీక్షలతో పాటు టీకా వేయించుకున్నాడు.
జూలై 11న జాబ్ వీసాపై సౌదీ అరేబియాలోని ఆల్-బాద్ తాబూక్కు ఫ్యామ్కో కంపెనీ నియోమ్ ప్రాజెక్ట్లో క్లీనింగ్ సూపర్వైజర్గా పనిచేసేందుకు వెళ్లాడు. కొన్నిరోజుల తర్వాత టీకా ఇంజక్షన్తో కుడి భుజంలో ఇన్ఫెక్షన్ అయింది. తరుచూ రక్తం కారుతున్నదని, మెరుగైన చికిత్స కోసం ఇండియాకు పంపించాలని మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని చంద్రశేఖర్ తల్లి ఆవేదనవ్యక్తం చేసింది. చంద్రశేఖర్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలిపింది.
ఢిల్లీలోని హెచ్ఆర్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా చంద్రశేఖర్ సౌదీ వెళ్లాడని, తిరిగి రప్పించడంలో సహకరించాలని తల్లి లక్ష్మి వారిని కోరింది. అత్యవసరంగా ఇండియాకు వాపస్ తెప్పించాలని అతని తల్లి లక్ష్మి గురువారం హైదరాబాద్లోని విదేశాంగ శాఖ పీఓఈ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించింది. కొడుకు అనారోగ్యానికి కారకులైన హైదరాబాద్లోని మెడికల్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని కోరింది.