అకాల వర్షం అన్నదాతలకు కన్నీరుమిగులుస్తున్నది. అసలే కొనుగోళ్లలో జాప్యం ఆవుతుండగా, సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం వెంటాడింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోగా, చాలాచోట్ల వడ్లు తడువకుండా కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని వాపోయారు.

రామడుగు/ ఓదెల/ కాల్వశ్రీరాంపూర్/ గన్నేరువరం/ ధర్మారం, మే 25 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పోసిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట మార్కెట్ యార్డులో వడ్ల కుప్పలు తడిసిపోయాయి. గన్నేరువరం మండలం పారువెల్ల, గన్నేరువరంలో తూకం వేసిన సంచులతో పాటు వడ్లు తడిచాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండలో వర్షానికి తలదాచుకునేందుకు వెళ్లిన గొర్రెల కాపరి ఒల్లాల లక్ష్మయ్య(65)పై గోడ కూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇదే గ్రామంతోపాటు రూపునారాయణపేటలో పలువురి ఇండ్ల పైకప్పులు గాలిలో లేచిపోయాయి. ఇండ్ల ప్రహరీలు కూలాయి. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెలో ఉమ్మనవేన రాజయ్య రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ధర్మారం మండలం మల్లాపూర్లో గాలివానతో కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తడిసింది. దీకొండ లచ్చయ్య అనే రైతు ధాన్యం బాగా తడవడంతో భార్యాభర్తలు ధాన్యాన్ని ఆరబెట్టారు. తూకం వేయడానికి రైతు సోనవేని చంద్రయ్య నింపిన ధాన్యం బస్తాలు తడిశాయి.
న్యాతరి పోచయ్య వ్యవసాయ బావి వద్ద విద్యుత్ స్తంభం విరిగి పడింది. నాయంపల్లి, బంజేరుపల్లి శివారులో స్తంభాలు విరగగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పత్తిపాక ఎక్స్రోడ్డు పక్కన ఉన్న వేప చెట్ల కొమ్మలు విరిగి కరీంనగర్-రాయపట్నం రహదారిపై పడడంతో కొంత సేపు రాక పోకలకు అంతరాయం ఏర్పడింది.