గంగాధర, మార్చి 17: ‘చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న మా ఊరికి నీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడండి’ అంటూ తాడిజెర్రికు చెందిన రామిడి సతీశ్ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. గంగాధర మండలంలో ఎండిన చెరువులు, అడుగంటిన బావులు, ఎండుతున్న పంటలను వీడియో తీసి పోస్ట్ చేశాడు. అందులో బోర్లు వేయిస్తూ.. బావులు పూడిక తీయిస్తూ రైతుల బాధలను కండ్లకు కట్టాడు. ఎమ్మెల్యే సత్యమన్నా ఉప్పరమల్యాల, రంగరావుపల్లి, కాసారం గర్శకుర్తి, తాడిజెర్రి గ్రామాల్లోని చెరువుల్లో నీళ్లు లేక బోరుబావులు ఎండిపోయాయని, నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
పంటలు ఎండి పోవడానికి ప్రధాన కారణం చెరువుల్లో నీళ్లు లేకపోవడమేనని వాపోయాడు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి చెరువులకు నీళ్లు వస్తాయని ఇక్కడి రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు. ఇక్కడి రైతులను దృష్టిలో పెట్టుకుని చెరువులు నింపి పంటలు కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సాగునీటి గోసను కండ్లగడుతున్నది. మార్చిలోనే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సాగునీరు అందించాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే పొలాలు చేతికొచ్చే సమయంలో నష్టపోతాయని ఆవేదన చెందారు.