కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పొద్దంతా ఎండ దంచికొట్టినా.. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిదుమారానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకాల వర్షం భయపెట్టింది. చాలాచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడగా, రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ తీగలు తెగడంతోపాటు పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో అక్కడక్కడా చీకట్లు అలుముకున్నాయి. ఇటు తీవ్రంగా వీచిన గాలికి చాలా చోట్ల ఇండ్ల పైకప్పులు, రేకులు లేచిపోయాయి.
మల్లాపూర్తోపాటు రత్నాపూర్, మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేట, దేశాయిపేట, రాగోజిపేట, కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్, తాండ్య్రాల, పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రం, నాంసానిపల్లి, లంబాడితండా, సిరిసిల్ల పట్టణంలోని గోపాల్నగర్, బీవైనగర్, కోనరావుపేట మండల కేంద్రంతో పాటు బావుసాయి పేట, కొండాపూర్, ధర్మారం, నిమ్మపల్లి, నిజామాబాద్, చందుర్తి మండలం, ముస్తాబాద్ మండల కేంద్రం, బందనకల్, గూడెం, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం, వెంకటాపూర్, హరిదాస్నగర్, పదిర, అక్కపల్లిలో భారీ గాలులతో వర్షం కురవగా భారీగా నష్టం వాటిల్లింది.
దేశాయిపేటలో తాటిచెట్టు నేలకూలి రెండు మేకలు మృతిచెందాయి. భీమారం మండలం రాగోజిపేటలో తాటిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. లంబాడితండా సమీపంలోని విద్యుత్ టవర్ లైన్ తెగిపోయి రాత్రి మంటలు చెలరేగాయి. ముస్తాబాద్ మండలం బందనకల్లో కరుణాకర్రెడ్డి, ముస్తాబాద్లో కృష్ణతోపాటు పలువురు చెట్లకింద కార్లు నిలపగా చెట్ల కొమ్మలు విరిగి ధ్వంసమయ్యాయి.
జగిత్యాల పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ ఖాదిర్ శనివారం సాయం త్రం మల్లాపూర్లోని ఓ ఎరువుల దుకాణం మందు బస్తాలను దించుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురై గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఎస్ఐ లచ్చయ్య పరిశీలించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఖాదిర్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.