కోరుట్ల, డిసెంబర్ 14: బంధువుల ఆస్తిని కాజేయాలనే దురాశ.. తన వృత్తికి పోటీ లేకుం డా చేసుకోవాలనే దుర్బుద్ధితో ముగ్గురి హత్యకు ఓ ఆర్ఎంపీ వేసిన మాస్టర్ ప్లాన్ను కోరుట్ల పోలీసులు భగ్నం చేశారు. సుపారీ గ్యాంగ్తోపాటు ఆర్ఎంపీ వైద్యుడిని అరెస్ట్ చేశారు. కోరుట్ల పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నిందితుల ఆరెస్ట్ చూపించిన సీఐ రాజశేఖర్రాజు విలేకరులతో వివరాలు వెల్లడించారు. కోరుట్ల మండలం పైడిమడుగులో ధనకంటి సంపత్ ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తనకు వరుసకు బావమరిది జగిత్యాల మండలం కన్నాపూర్కు చెందిన విష్ణువర్ధన్కు మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయి. విష్ణువర్ధన్ రాయికల్లో వ్యాపారం నడుపుతున్నాడు.
ఈ క్ర మంలో సంపత్ విష్ణువర్ధన్ కుటుంబ సభ్యులతో చనువుగా మెదిలేవాడు. అయితే అతడిని అడ్డు తొలగిస్తే అతని ఆస్తితోపాటు కుటుంబంపై పట్టు సాధించవచ్చని సంపత్ దురాశపడ్డాడు. విష్ణువర్ధన్తోపాటు అతని బావమరిది అజయ్ ని హత్య చేయాలని కుట్రపన్నాడు. ఈ క్రమం లో కొద్దిరోజులుగా సమయం కోసం వేచిచూస్తున్నాడు. అయితే ఇటీవల విష్ణువర్దన్కు టైఫాయి డ్ రాగా, సంపత్ చికిత్స వద్ద తీసుకున్నాడు. తర్వాత కొద్దిరోజులకే నరాల సమస్య రావడంతో వెంట నే దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు.
ఇంజక్షన్ ఓవర్ డోస్ కారణంగా ఇలా జరిగిందని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే సంపత్ వద్ద చీటీల డబ్బులు రావాల్సి ఉండడం, ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వస్తుండ డం, ఇంకా రాయికల్ నుంచి పైడిమడుగు వచ్చే క్రమంలో 20 రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు వెంబడించడం లాంటి ఘటనలతో విష్ణువర్ధన్కు అనుమానం వచ్చింది. తనపై ఏదో కుట్ర జరుగుతుందని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తోటి ఆర్ఎంపీ హత్యకు స్కెచ్..
పైడిమడుగులో సంపత్ ప్రాక్టీస్ చేస్తున్న దవాఖానకు సమీపంలో రాజేందర్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాజేందర్ వద్దకు చాలా మంది పేషెంట్లు వస్తుండడంతో తన వృత్తికి అడ్డుగా ఉన్నాడని సంపత్ అతడిపై కక్షగట్టాడు. ఈ నెల 5న రాత్రి సమయంలో ఆర్ఎంపీ రాజేందర్ ఇంట్లో ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బయటకు రావాలని బెదిరించారు. అదే సమయంలో గ్రామస్తులు గుమిగూడడంతో దుండగులు పారిపోయారు. ఈ విషయమై రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముగ్గురి హత్యకు రూ.14లక్షల సుపారీ
ఈ రెండు ఫిర్యాదులపై రంగంలోకి దిగిన పోలీసులు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నా రు. విష్ణువర్దన్, అజయ్, రాజేందర్ను అంతమొందించాలని సంపత్ మాస్టర్ ప్లాన్ వేశాడు. కోరుట్ల శివారు విక్టరీ దాబా వద్ద సుపారీ గ్యాంగ్తో రూ.14లక్షలకు ఒప్పం దం కుదుర్చుకున్నాడు. మొదటగా రాజేందర్ను హత్య చేసేందుకు రూ.4లక్షలు, విష్ణువర్దన్, అజయ్ను హత్య చేసేందుకు రూ.10 లక్షలు చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో రూ.4 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు చెల్లించడంలో జాప్యం చేయగా ఇదే సమయంలో పోలీసులు చాకచక్యంగా కుట్రను భగ్నం చేశారు.
సుపారీ గ్యాంగ్ సభ్యులను బుధవారం పట్టణ శివారు మాదాపూర్కాలనీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2 కార్లు, 4 సెల్ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. నిందితుల్లో పైడిమడుగుకు చెంది న ధనకంటి సంపత్ చారి, క్యాతం శేఖర్, మేది ని శ్రీకాంత్, కోరుట్ల ఎస్కోనిగుట్ట కాలనీకి చెంది న ఆకుల అశోక్, ఇందిరారోడ్డు కాలనీకి చెందిన విత్తనాల నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
సుపారి గ్యాంగ్ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోరుట్ల ఎస్ఐలు చిర్ర సతీశ్, శ్యాంరాజ్, కథలాపూర్ ఎస్ఐ రాంచందర్గౌడ్, మేడిపల్లి ఎస్ఐ సుధీర్రావు, పోలీస్ సిబ్బంది హలీం, విజయ్, సత్తయ్య, ఎల్లయ్య, శ్రీధర్, సాగర్ను ఎస్పీ సింధూశర్మ, మెట్పల్లి డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ రాజశేఖర్రాజు అభినందించారు.