Bommena | కథలాపూర్, ఫిబ్రవరి 22: కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన లోలపు శ్రీనివాస్ (40) అనే వ్యక్తి మస్కట్ దేశంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ స్థానికంగా దినసరి కూలీగా పనిచేశారు. అయినప్పటికి కుటుంబ పోషణ గడవడం కష్టంగా మారింది.
శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం మస్కట్ దేశం వెళ్లగా అక్కడ అనారోగ్యంతో బాధపడుతుంటే తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయించారు. చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు ఆదివారం సమాచారం అందింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహం స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.