భానుడు దంచికొడుతున్నడు. మూడు నాలుగు రోజుల నుంచి విశ్వరూపం చూపుతున్నడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సుర్రుమంటూ, మధ్యాహ్నంకల్లా మాడు పగులగొడుతున్నడు. ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీల దాకా నమోదవుతుండగా, జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పది దాటిందంటే బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. సోమవారం శంకరపట్నంలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు నమోదైంది. కాగా, నిరుటి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని, అప్రమత్తంగా ఉండి ఎండల నుంచి రక్షించుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తున్నది.
– కరీంనగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఉదయం పది గంటల నుంచే ప్రభావం కనిపిస్తున్నది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, ఇతర పనులకు వెళ్లే ప్రజలు ఎండ తాపాన్ని తాళలేక పోతున్నారు. నిరుటి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని, అప్రమత్తంగా ఉండి ఎండల నుంచి రక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
చేయాల్సినవి
ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్లొద్దు. వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు వాడాలి
తెలుపు రంగు ఉన్న పల్చటి కాటన్ వస్ర్తాలు ధరించాలి
నెత్తికి టోపీ లేదా రుమాలు తప్పని సరిగా వాడాలి
మంచినీళ్లు ఎక్కువ సార్లు తాగించాలి
మజ్జిగ లేదా గ్లూకోజు కలిపిన నీరు లేదా రీ హైడ్రేషన్ ద్రావణం తాగాలి
ఎండలో తిరిగి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె వంటివి తీసుకోకూడదు
వడదెబ్బకు గురైన వారిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి
తడి గుడ్డతో శరీరమంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటితో బట్టను ముంచి శరీమంతటా తుడవాలి. చల్లని
గాలి తగిలేలా ఫ్యాన్ కింద ఉంచాలి.
అయినా మార్పులు కనిపించకపోతే దగ్గరలోని దవాఖానకు తరలించాలి
కరీంనగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఈ యేడాది ఎండలు దంచి కొడుతున్నాయి. నాలుగైదు రోజులుగా భగ్గుమంటున్నాయి. గతేడాది ఏప్రిల్లో మొదటి పది రోజులు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటలేదు. 20వ తేదీ తర్వాత 39 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యాయి. నెలాఖరులో ఒకటి రెండ్రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీలు రికార్డయ్యాయి. కానీ, ఈ యేడాది మాత్రం ఏప్రిల్ మొదటి పది రోజుల్లోనే 37 నుంచి 39 డిగ్రీలు నమోదు కాగా, ఈ నెల 13న 40 నుంచి 41 డిగ్రీలకు చేరుకున్నాయి. సోమవారం కూడా గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శంకరపట్నం మండలంలో అయితే 43 డిగ్రీలకు చేరుకోగా, మం థని మండలంలో ఏకంగా 45 డిగ్రీలకు చేరుకున్నది. వచ్చే నాలుగైదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. గతేడాది మేలో మొత్తంగా 38 నుంచి 39 డిగ్రీల మధ్యనే ఉష్ణోగ్రతలు న మోదయ్యాయి. కానీ, ఇప్పుడు ఏప్రిల్లోనే ఎండలు మండుతున్నాయి.
జనం ఉక్కిరిబిక్కిరి
ముదురుతున్న ఎండలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోత, వడగాలులు కూడా క్రమంగా తోడవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలకు చేరుకోవడం, ఉదయం పది గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం ఇండ్ల నుంచి జనం బయటికి రాలేకపోతున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు మధ్యాహ్నం 12 గంటల వరకే ఇళ్లకు చేరుకుంటున్నారు. పనులు జరిగే చోట వీరికి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నది. పారిశ్రామిక ప్రాంతంలోనైతే పొద్దంతా వేడి గాలులు వీస్తుండగా, ఇండ్ల నుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. కాగా అధికారులు సైతం ఎండల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉంచుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
అటు ఉక్కపోత.. ఇటు ఆటవిడుపు
ఓదెల, ఏప్రిల్ 17: మూడు నాలుగు రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండగా, ప్రజలు తట్టుకోలేక ఇండ్లలోనే కూలర్లు, చెట్ల కింద సేదతీరుతున్నారు. ఎండకు తట్టుకోలేక పిల్లలు, పెద్దలు నీడపట్టున ఉంటూ వివిధ రకాల ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలు చెట్ల కింద పలు రకాల ఆటలు ఆడుతూ ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. మహిళలు కూడా మధ్యాహ్నం చెట్ల కింద, ఇండ్లల్లో గుమిగూడి కచ్ఛకాయలు, అష్టాచెమ్మ వంటి ఆటలు ఆడుకుంటున్నారు. కొందరు ఇంట్లో ఉండి పనులు చేసుకుంటున్నారు.
వడ దెబ్బ లక్షణాలు
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తల నొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం రావడం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక, పూర్తి అపస్మారక స్థితికి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని చెబుతున్నారు. వచ్చే నెలలో ఎండల ప్రభావం మరింత పెరిగే ముప్పు ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
మంథనిలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు..
రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో నమోదైంది. ఈ మేరకు ప్రభుత్వ టీఎస్డీపీఎస్ వెబ్ సైట్ మంథని మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడిగా, మంథని రెడ్ అలర్ట్లో చూపించారు.