సారంగాపూర్, మే 25: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి, వెనువెంటనే కొనకపోతే ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. కల్లాల్లోకి రాజకీయం చేయడానికి రాలేదని, కర్షకుల కష్టాన్ని చూసి వచ్చామని చెప్పారు. ఆదివారం బీర్పూర్ మండలం నర్సింహులపల్లెలోని ఐకేపీ, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డితో కలిసి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు అరిగోస పడుతుంటే, అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయి కన్నీళ్లు పెడుతుంటే సీఎం రేవంత్రెడ్డి అందాల పోటీలు నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని, లేదంటే రైతుల తిరుగుబాటు తప్పదని, గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు, నీళ్లు ఇచ్చి, పండిన పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా రైతులు కష్టపడి పంట పండిస్తే సకాలంలో కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహించారు.
ఓట్ల కోసం ప్రతి ఇల్లు తిరిగిన నాయకులు రైతులకు కష్టాలొస్తే ఇప్పుడు ఎకడున్నారని ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఇక్కడ సారంగాపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలు రాజు, మాజీ పాక్స్ చైర్మన్ మెరుగు రాజేశం, మాజీ సర్పంచ్ భూమన్న, పాక్స్ డైరెక్టర్ సతీశ్, నాయకులు సుధాకర్, శ్రీనివాస్, సుదర్శన్ లక్ష్మీ నారాయణ, సుధ రమేశ్, రాజేందర్ ఉన్నారు.