మెట్పల్లి, డిసెంబర్ 10: వచ్చే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, ఢిల్లీలోని ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం మెట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయి రాష్ర్టా న్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపారని పేర్కొన్నారు. అలాంటి నేతపై బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పార్లమెంట్ సభ్యుడైన సంజయ్ స్థాయి మరిచి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆయనకు దమ్ముంటే తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయించాలని సవాల్ విసిరారు. మెట్పల్లి ఖాదీగ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ పరిధిలోని వృథాగా ఉన్న స్థలాల్లో దుకాణా సముదాయాలను నిర్మించి ఖాదీకి నెలకు కనీసం రూ.14 లక్షలు, సర్కారుకు సంవత్సరానికి రూ.2 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నామని చెప్పారు.
ఖాదీ చైర్మన్గా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా సంస్థ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నానన్నారు. బండి సంజయ్ ఝూటా మాటలను ప్రజలు పట్టించుకోవద్దని కోరారు. రాష్ట్రంలో అధునాతన హంగులతో కలెక్టరేట్లను, రాష్ట్ర సెక్రటేరియట్ను నిర్మించుకున్నామని చెప్పారు. అలాగే సెక్రటేరియట్కు మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని తెలిపారు. తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని స్పష్టం చేశారు.