ఆధునిక హంగులు.. అత్యాధునిక సౌకర్యాలతో జగిత్యాల జిల్లా కేంద్రంలో నయా పోలీస్ సౌధం సిద్ధమైంది. సమీకృత కలెక్టరేట్ సమీపంలోని ధరూర్ కాలనీలో 20 ఎకరాల స్థలంలో జీ+3 పద్ధతిలో భవనం రూపుదిద్దుకున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత కీలకమైన ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ను వచ్చే నెల 3న మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండగా, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
– జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 29
జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం మరింత పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాలనాసంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. తర్వాత కొత్త జిల్లాల్లో అధునాతనమైన సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొత్త జిల్లాలైన జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కలెక్టరేట్లు అందుబాటులోకి తెచ్చింది. పెద్దపల్లి, సిరిసిల్లలో పోలీస్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది. తాజాగా జగిత్యాల జిల్లాకేంద్రంలోని ధరూర్ కాలనీలో ఎస్సారెస్పీ స్థలంలో సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్ను నిర్మించింది. ఇది గత డిసెంబర్ 7న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నది
20 ఎకరాల స్థలంలో పోలీస్ భవనం
సమీకృత పోలీస్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు సమీకృత కలెక్టరేట్కు సమీపంలోనే ధరూర్ కాలనీలోనే సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2017లో పనులు ప్రారంభించారు. ఇందులో 47వేల చదరపు ఫీట్ల స్థలంలో 38.4 కోట్లతో పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మిస్తున్నారు. జగిత్యాల ఎస్పీగా ఎగ్గడి భాస్కర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పనులను మరింత వేగవంతం చేశారు.
జిల్లా పోలీస్ ప్రధాన ఆఫీస్తో పాటు ఎస్పీ కార్యాలయం, ఎస్పీ క్యాంపు ఆఫీస్, ఎస్పీ రెసిడెన్సీ, అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ రెసిడెన్సీ, గ్రీవెన్స్ హాల్, పాస్పోర్టు వెరిఫికేషన్ సెల్, పీఆర్వో ఆఫీసు, పోలీస్ ప్రధాన కార్యాలయ స్టోర్, డీసీఆర్బీ, ఐటీఅండ్కమ్యూనికేషన్, ఫింగర్ప్రింట్ క్లూస్ టీం, ఎస్బీ విభాగాలకు కార్యాలయాలు, ఏర్ హెడ్ క్వార్టర్స్, డిజిటల్ ట్రైనింగ్, శిక్షణ కేంద్రం, ఆడిటోరియం, అధికారుల నివాస గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్కు సంబంధించిన పనులు, మిగిలిన ఫ్లోర్లల్లో పనులు చివరి దశలో ఉన్నాయని పోలీస్ హౌసింగ్ ఇంజినీరింగ్ అధికారులు చెతున్నారు. కాంపౌండ్, మైదానం, గ్రీనరీ, పార్కింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్3న కేవలం గ్రౌండ్ ఫ్లోర్నే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.