కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ దోపీడీ కేసులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తున్నది. దొంగలు నగల షాపు లూటీకి అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి, ఎటువంటి ఆధారాలు చిక్కకుండా జాగ్రత్త పడినా.. చివరి నిమిషంలో చేసిన తప్పే పట్టించినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లా సరిహద్దులు దాటే క్రమంలో తమ ఫోన్ను బండకేసి బాదడం, పగిలిపోయి ముక్కలు కావడం, అది పోలీసులకు చిక్కడం అత్యంత కీలక క్లూగా మారింది. ఐఎంఈఐ ఆధారంగా అందులో ఫోన్ నంబర్ గుర్తించి, కూపీ లాగితే డొంకంతా కదిలింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా, దోపిడీకి బిహార్ జైలు నుంచే నాయకత్వం వహించిన సుభోద్ సింగ్ను కరీంనగర్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది.
కరీంనగర్ రాంనగర్ మే 15 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీని కరీంనగర్ పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. ఇద్దరు దొంగలతోపాటు సిమ్లు విక్రయించిన ఒక సహాయకుడిని అరెస్టు చూపిన విషయం విదితమే. అయితే రెక్కీ నుంచి దోపిడీ వరకు.. పారిపోవడం నుంచి దోచిన సొత్తును విక్రయించే వరకు అంతా పక్కాగా ప్లాన్ చేయడం, ఓ ప్రత్యేక యాప్ను రూపొందించుకోవడం, దాని ఆధారంగానే దోపిడీ చేసిన విషయం వెలుగులోకి రావడం అందరినీ నివ్వెరపరిచింది. ఈ దొంగలు పెద్దపల్లి, ధర్మపురిలో రోజుల తరబడి బస చేసి ఎటువంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడినా.. చివరకు పగిలిపోయిన ఫోనే వీరిని పట్టించినట్టు తెలుస్తున్నది.
ఈ నెల 3న దోపిడీ జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దొంగలను పట్టుకునేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ, దొంగలు అత్యంత చాకచక్యంగా తప్పించుకుంటూ వెళ్లారు. వారు వెళ్లిన తీరును చూస్తే.. ఒక సీసీ కెమెరాలో కనిపించిన దుండగులు.. అదే దారి వెంట ఉన్న మరో సీసీ కెమెరాలో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయినా ఒక్కో సీసీ ఫుటేజీని పరిశీలిస్తూ.. ఆధారాలు సేకరిస్తూ.. ముందుకెళ్లగా, అప్పటికే దొంగలు జిల్లా సరిహద్దులు దాటినట్టు గుర్తించారు.
ఇదే క్రమంలో జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లో పర్యటించిన పోలీసులు, ఆయాచోట్ల ప్రజలకు దొంగల వివరాలను వెల్లడించారు. దొంగల ఫొ టోలు, దోపిడీ జరిగిన తీరు, వారు వాడిన వాహనాలు తదితర విషయాలను వివరించగా.. ఓ వ్యక్తి స్పందించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. సదరు వ్యక్తి పోలీసుల కు ఓ ఫోన్ గురించి సమాచారం ఇచ్చాడు. బుగ్గారం మండలం మద్దునపల్లి వద్ద నుంచి తాను వస్తుండగా.. బైక్లపై వెళ్తున్న ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న సెల్ఫోన్ను బండకేసి బాది వెళ్లినట్టు అనిపించిందని వివరించాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చాలాసేపు సోదా చేయగా, సెల్ఫోన్ పగిలి ముక్కలు ముక్కలు అయినట్టు గుర్తించారు. వాటిని సేకరించి, చివరకు ఐఎంఈఐ నంబర్ను సాధించారు.
కూపీలాగితే కదిలిన డొంక
వెంటనే ఆ ఐఎంఈఐ నంబర్ను అక్కడి పోలీసులు కరీంనగర్ సీపీ గౌష్ ఆలంకు చేరవేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు. ఆ ఫోన్లో ఏ నంబర్ సిమ్ వినియోగించారో వివరాలు సేకరించారు. ఆ సిమ్ ఆధారంగా అనేక అంశాలను ఆరా తీశారు. మ రింత లోతుగా వెళ్లగా.. ఆ సిమ్ నంబర్తో ఒకరికి రూ.10వేలు ఫోన్ పే చేసినట్టు గుర్తించారని తెలిసింది. ఆ మేరకు పరిశీలిస్తే.. డబ్బులు పీఎంజే దోపిడీకి బిహార్ జైలు నుంచే నాయకత్వం వహించిన సుభోద్ సింగ్ బంధువులకు వెళ్లినట్టు తెలిసింది.
దోపీడీ జరిగిన ఒక్క రోజు ముందు ఒక దొంగ ఈ సెల్ నుంచి రూ.10 వేలను మరో నంబర్కు ఫోన్ పే చేసినట్టు బయటపడింది. దాని ఆధారంగా పోలీసులు అన్వేషించడంతో ‘ది గోల్డెన్ థీఫ్’ నాయకుడిగా పేరొందిన బిహార్ బాయ్ అయిన సుభోద్ సింగ్ వినియోగించిన ఫోన్ అని తేలింది. ప్రస్తుతం ఆ నంబర్ సుభోద్ సింగ్ కుటుంబసభ్యులు వినియోగిస్తున్నట్టు తెలిసింది. అక్కడి పోలీసులకు ఈ సమాచారం అందించి, వారి సహకారం తీసుకున్నట్టు తెలుస్తున్నది. అంతే కాకుండా, కరీంనగర్ పోలీసులు విడుదల చేసిన దొంగల ఫొటోలు సైతం అనేక భాషల్లో ప్ర చారం కావడంతో బిహార్ పోలీసులు రఘునాథ్ కర్మాకర్ను గుర్తించి, అతడి వివరాలను అందించినట్టు తెలిసింది.
వెంటనే కమిషనరేట్ పోలీసులు బిహార్ జైలులో ఉన్న సుభోద్సింగ్తో మా ట్లాడి రఘునాథ్ కర్మాకర్ వివరాలను తెలుసుకొని, ఆ ముఠా సభ్యులను పట్టుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఈ దోపిడీతో 13 మందికి సంబంధం ఉందని గుర్తించి, ప్రస్తుతం ముగ్గురిని అరెస్టు చూపారు. ఇంకా పది మందిని పట్టుకోవాల్సి ఉన్నది. అందుకోసం ప్రధాన సూత్రధారి అయిన సుభోద్సింగ్ను కరీంనగర్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునేందుకు చట్టపరంగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది. అతి త్వరలోనే ఆధీనంలోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సుభోద్సింగ్ను అదుపులోకి తీసుకుంటే.. మిగిలిన దొంగల ఆచూకీతోపాటు ఆభరణాల విక్రయాల వ్యవహారంకూడా బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.