రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదటగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్ (కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్ -కేసీఆర్), ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం హెలీకాప్టర్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లా కమలాపూర్ చేరుకుంటారు.
కమ్యూనిటీ హాల్స్ కాంప్లెక్స్, మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ బాలుర వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, బాలికల పాఠశాల, కేజీబీవీ జూనియర్ కళాశాలను ప్రారంభించనున్నారు. అనంతరం ఎంజేపీ స్కూల్లో పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి జమ్మికుంటకు చేరుకొని, డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే, మొదటిసారిగా హుజూరాబాద్ గడ్డపై అడుగుపెట్టబోతుండగా, నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
– హుజూరాబాద్/ జమ్మికుంట, జనవరి 30
హుజూరాబాద్/ జమ్మికుంట, జనవరి 30 : విప్లవోద్యమాలకు ఊపిరిలూదిన జమ్మికుంట గడ్డపై తెలంగాణ ఉద్యమ బిడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ నేడు అడుగుపెట్టనున్నారు. మొదటిసారిగా జమ్మికుంటకు వస్తున్న రామన్న కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పల ఈశ్వర్, గంగుల కమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి అమాత్యుడు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా హన్మకొండ జిల్లా కమలాపూర్కు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి కమలాపూర్ నుంచి ర్యాలీగా జమ్మికుంటకు చేరుకుంటారు.
టౌన్ పరిధిలో 3కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న కస్తూర్బా పాఠశాల, 20 లక్షలతో రూపుదిద్దుకున్న అమరవీరుల స్తూపం, 25లక్షలతో నిర్మించిన జమ్మికుంట స్వాగత తోరణం, 20లక్షలతో పూర్తయిన నేతాజీ పార్క్ను ప్రారంభిస్తారు. అంతేకాకుండా పలు అభివృద్ధి పనులను కూడా పరిశీలించనున్నారు. తర్వాత పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. 50వేల మందికి పైగా హాజరయ్యే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మంత్రి కేటీఆర్ పర్యటన, సభ ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సభ విజయవంతానికి కృషి చేస్తున్నారు.
పర్యటన షెడ్యూల్ ఇలా..
కార్పొరేషన్/ హుజూరాబాద్, జనవరి 30 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి ఉదయం 9.15 గంటలకు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ హెలిప్యాడ్లో దిగుతారు. 9.30 గంటలకు కరీంనగర్లో 12కోట్లతో నూతనంగా నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్ భవనాన్ని ప్రారంభిస్తారు. దీని పక్కనే 4 కోట్లతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం హెలీకాప్టర్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలానికి ఉదయం 11 గంటలకు చేరుకుంటారు.
కమ్యూనిటీ హాల్స్ కాంప్లెక్స్, మహాత్మాజ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ బాలుర వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, బాలికల పాఠశాల, కేజీబీవీ జూనియర్ కళాశాలలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంజేపీ స్కూల్లో పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. 2 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన జమ్మికుంటకు చేరుకుంటారు. డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి రోడ్డు మార్గాన హుజూరాబాద్కు చేరుకొని, అక్కడి నుంచి హెలీకాప్టర్లో హైదరాబాద్ పయనమవుతారు.
4 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
కార్పొరేషన్, జనవరి 30 : కరీంనగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హైస్ పక్కనే కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. జిల్లా పశువైద్యశాల స్థలంలో 4 కోట్ల వ్యయంతో జీ ప్లస్ వన్గా భవనం నిర్మాణమైంది. గ్రౌండ్ ఫ్లోర్లో వెయిటింగ్ హాల్, మీటింగ్ హాల్, ఎమ్మెల్యేగది, పీఏ గది, వచ్చే ప్రజలకు టాయిలెట్స్, సెక్యూరిటీ గదిని నిర్మించారు. అలాగే మొదటి అంతస్తులో ఎమ్మెల్యే గృహ అవసరాలకు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేశారు. అందులో డైనింగ్ హాల్, కిచెన్తోపాటు మరో హాల్, మూడు బెడ్రూంలను సిద్ధం చేశారు. పూర్తిగా ఆధునిక వసతులు కల్పించారు. ఈ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూడా మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు.
భారీ స్వాగతం పలికేందుకు సన్నాహాలు
మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల నుంచి రాష్ర్టానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తున్నారు. మున్సిపల్శాఖ మంత్రిగా బల్దియాలను అభివృద్ధి చేయిస్తున్నారు. అలాగే జౌళిశాఖ మంత్రిగా చేనేత, మరమగ్గాల పరిశ్రమకు జీవం పోస్తున్నారు. మరోవైపు ‘అన్నా’ అని పిలిస్తే చేయి అందిస్తున్నారు. ఎవరికి ఏ ఆపదొచ్చినా అండగా నిలుస్తున్నారు.
కేసీఆర్ తర్వాత అంతే స్థాయి నాయకుడిగా పేరొందిన ఆయన, ఇప్పటి వరకు ఉద్యమాల గడ్డ హుజూరాబాద్ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. అయితే మొదటిసారిగా మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గానికి వస్తుండగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కమలాపూర్ నుంచి జమ్మికుంట వరకు 20 కిలోమీటర్ల పొడవునా వందలాది వాహనాలతో ర్యాలీగా వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లతో సభా ప్రాంగణాన్ని గులాబీమయంగా మార్చారు.
50వేల మందితో సభ
మొదటిసారి జమ్మికుంటకు వస్తున్న మంత్రి కేటీఆర్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నం. భారీ ఏర్పాట్లు చేస్తున్నం. 50వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. రామన్న అభివృద్ధి ప్రధాత. ఆయనకు మా నుంచి ఏమివ్వగలం. భారీ సభను బహుమతిగా అందిస్తం. సభకు వచ్చే ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినం. ఇబ్బందుల్లేకుండా చూస్తం.
– పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ
అమరవీరుల స్తూపం
ఒకనాడు జమ్మికుంట విప్లవోద్యమాలకు అడ్డాగా ఉండేది. ఇక్కడి నుంచే ఎంతో మంది ఉద్యమాలవైపు అడుగులు వేశారు. 1969లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత మలి దశ ఉద్యమంలోనూ ఒక్కటిగా కదిలారు. జమ్మికుంట గాంధీ చౌక్ను తెలంగాణ చౌక్గా మార్చి ఉద్యమానికి వేదికగా చేశారు. తమ ఉద్యమ ఆకాంక్షను తెలిపి రాష్ట్ర ఏర్పాటులో భాగమయ్యారు. స్వరాష్ట్రంలో తొలి, మలి ఉద్యమాలకు ఊపిరిలూదిన జమ్మికుంట పాత మున్సిపల్ సమీప చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్మారకస్తూపం ఏర్పాటైంది. అందుకోసం మున్సిపల్ పాలకవర్గం 20 లక్షలు వెచ్చించి, గొప్పగా తీర్చిదిద్దింది. అంతేకాకుండా పట్టణంలోని పద్మశాలీ వాడలో ఏండ్లనాటి సుభాష్ చంద్రబోస్ విగ్రహం చుట్టూ 20లక్షలతో పార్క్ను ఏర్పాటు చేసింది. అలాగే హుజూరాబాద్ రోడ్డు, వావిలాల రోడ్డులో ప్రధాన రహదారికి 45లక్షలతో స్వాగత తోరణాలు కట్టించారు. వీటిని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు ఏర్పాట్లు చేశారు.
3కోట్లతో కస్తూర్బా
జమ్మికుంట ప్రాంత విద్యార్థులకు గతంలో కస్తూర్బా పాఠశాల కోసం భవనాన్ని నిర్మించారు. అందులో సరిపడా గదులు లేకపోవడంతో నూతన పాఠశాల భవనం కోసం ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ స్థాయిలో కస్తూర్బా భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం 3కోట్లు మంజూరు చేసింది. సదరు భవనం ఇటీవల పూర్తయింది. ఈ స్కూల్ ఇంటర్ వరకు రెసిడెన్షియల్ విద్యను అందిస్తుండగా, కొత్త భవనాన్ని నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.
నాడు తండ్రి.. నేడు తనయుడు
2001లో అంటే సరిగ్గా 22 ఏళ్ల క్రితం జమ్మికుంట డిగ్రీ, పీజీ కాలేజీ క్రీడా మైదానం వేదికగా కేసీఆర్ సభ నిర్వహించారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఎంత అవసరమో అర్థమయ్యేలా వివరించారు. ప్రజల ఆకాంక్షను తన గొంతుకగా మార్చిన కేసీఆర్కు అప్పుడే హుజూరాబాద్ నియోజకవర్గ్గ ప్రజలు జైకొట్టారు. అదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పక్షాన నిలిచారు. నాలు గు జడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీలతోపాటు మెజార్టీ సర్పంచ్ స్థానాలను కట్టబెట్టారు. ఇలా ఆది నుంచీ అధినేత కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూ డా అండగా నిలుస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ కూడా హుజూరాబాద్ గడ్డపై మమకారం చూపుతున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకాన్ని ఇక్కడి నుంచే శ్రీకా రం చుట్టారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సంకల్పంతో దళితబంధుకు ఇక్కడే అంకురార్పణ చేశారు. నాడు కేసీఆర్ ప్రసంగించిన వేదికపై నేడు ఆయన తనయుడు కేటీఆర్ మొదటిసారి అడుగుపెట్టబోతున్నారు. యువనేత రామన్న రాక పై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు.
ఆధునిక హంగులతో ఆర్అండ్బీ గెస్ట్హౌస్
కార్పొరేషన్, జనవరి 30 : కరీంనగర్ నడిబొడ్డున ఆధునిక హంగులతో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ రూపుదిద్దుకున్నది. పాత అతిథిగృహం స్థానంలో 12 కోట్లతో అత్యంత సుందరంగా భవనం ముస్తాబైంది. దీనికి కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్ (కేసీఆర్)గా మంత్రి గంగుల నామకరణం చేశారు. ఎకరం స్థలంలో ఆధునిక సౌకర్యాలు, సకల హంగులు, పారింగ్ స్థలంతో జ్లీపస్వన్గా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రెన్స్ లాబీతోపాటు మూడు డూప్లెక్స్ సూట్లు, మరో మూడు సాధారణ సూట్లు సిద్ధం చేశారు. వీటిల్లో లివింగ్ రూం. డ్రాయింగ్ రూం, అటాచ్ బాత్ రూంతో కూడిన బెడ్రూంతోపాటు సమావేశాల నిర్వహణకు సంబంధించి రెండు చిన్న హాల్స్తోపాటు డైనింగ్ హాల్, కిచెన్ ఏర్పాటు చేశారు. అలాగే మొదటి అంతస్తులో డబుల్ బెడ్రూంలతో కూడిన మూడు డూప్లెక్స్ సూట్లు, సీఎం కోసం ప్రత్యేకంగా సూట్ను ఏర్పాటు చేశారు. సీఎం కరీంనగర్కు వచ్చినా అందులో ఉండే విధంగా సకల ఏర్పాట్లు చేశారు. ఎంట్రెన్స్లో పూర్తిస్థాయిలో గార్డెన్తోపాటు పెద్ద సంఖ్యలో వాహనాలను పార్కింగ్ చేసుకునేలా సదుపాయాలను కల్పిస్తున్నారు. వీటితోపాటు భవనంపై గార్డెన్ను కూడా సిద్ధం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఏసీ సౌకర్యం కల్పించారు. నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.