T Jeevan Reddy | సారంగాపూర్, జూలై 30 : భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పెంబట్ల గ్రామానికి చెందిన పస్తం స్వప్న, వారి సోదరులు పరమేష్, దుర్గెష్ల ఇల్లు భారీ వర్షానికి కూలిపోవడంతో పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆర్డీవో మధుసుధన్, తహసీల్దార్ వహిదొద్దిన్లతో ఫోన్లో మాట్లాడుతూ వర్షాలకు పలువురి ఇండ్లు పూర్తిగా కూలిపోయాయని, నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించి నూతన ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. అధికారులు క్షత్రస్థాయిలో పరిశీలించి బాధిత కుటుంబాన్ని అదుకోవాలన్నారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహయం అందించేలా తనవంతు కృషి చేస్తానని, నూతన ఇల్లు మంజూరయ్యేలా చూస్తానని, బాధిత కుటుంబాలకి జీవన్ రెడ్డి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి జీవన్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేష్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తేలు రాజు, నాయకులు వాసం శ్రీనివాస్, అలీమ్, జనార్ధన్, వెంకటేష్, వేణు, మల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.