ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం నామినేషన్ల పండుగ కనిపించింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దాఖలు చేశారు. కాగా, కరీంనగర్లో పలువురు అభ్యర్థులు సాదాసీదాగా వేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ మరోసెట్టు వేయగా, మానకొండూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొండగట్టులో పూజలు చేసి, సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు. చొప్పదండిలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మరో మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, గురువారం ఒక్క రోజే జిల్లాలో 45 దాఖలవ్వగా, ఇప్పటి వరకు మొత్తం 97 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, శుక్రవారం ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో నామినేషన్ల జాతర కొనసాగుతున్నది. ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు పండుగ వాతావరణంలో దాఖలు చేస్తున్నారు. గురువారం సిరిసిల్లలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ సాదాసీదాగా నామినేషన్ వేయగా, పలువురు అభ్యర్థులు వేలాది మంది ప్రజల సమక్షంలో అట్టహాసంగా దాఖలు చేశారు. మరికొందరు మరిన్ని సెట్ల నామినేషన్లు వేశారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
కరీంనగర్ శాసనసభా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ గురువారం మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11:30 కు స్థానిక వేంకటేశ్వర దేవాలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం అకడి నుంచి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆశీర్వచనం తీసుకొని, నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్వో కే మహేశ్వర్కు నామినేషన్ పత్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, పలువురు నాయకులతో కలిసి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆర్వో అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పాటించాల్సిన సూచనల కరదీపికలు మంత్రి గంగులకు అందజేశారు.
-కలెక్టరేట్, నవంబర్ 9
మంథని, నవంబర్ 9: మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట మధూకర్ మరో మూడు నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. గురువా రం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాదాడీ ప్రభాకర్రెడ్డి, ప్రముఖ న్యాయవాది శశికాంత్కాచే, బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డిద్వారా నామినేషన్లు వేశారు. అలాగే బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సైతం తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. స్థానిక ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి హనుమానాయక్కు తన నామినేషన్ పత్రాన్ని పుట్ట శైలజ అందజేశారు.
ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. కాగా, మంత్రి ఈశ్వర్ ఉదయాన్నే కుటుంబసమేతంగా రామగుండం విజయదుర్గా దేవి, అయ్యప్పస్వామివారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ధర్మపురి నృసింహుడి క్షేత్రానికి వచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లారు. ధర్మపురిలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. కొప్పులతో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతకాని ఆర్వో కార్యాలయం దాకా రాగా, కార్యాలయం లోపలికి డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ బాధినేని రాజేందర్ వెళ్లారు.
-ధర్మపురి, నవంబర్ 9
పెద్దపల్లి టౌన్ నవంబర్ 9: పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి గురువారం కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. అంతకుముందు తన నివాసంలో అర్చకులు ఆయనతో పూజలు చేయించి ఆశీర్వచనం అందించారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్ రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో కుటుంబసమేతంగా పూజలు చేశారు. అనంతరం పెద్దపల్లిలోని రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్దపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ మధుమోహన్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. తర్వాత పెద్దమసీదు నుంచి వేలాదిగా తరలివచ్చిన శ్రేణులతో కలిసి రాల్యీగా అమర్నగర్, ప్రగతినగర్, అయ్యప్ప దేవాలయం మీదుగా బస్స్టాండ్ వరకు చేరుకున్నారు. ఆయన వెంట మండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్రావు, బీఆర్ఎస్ నాయకులు సీ. సత్యనారాయణరెడ్డి, మేకల మల్లేశం, వేముల రాంమూర్తి, తిరుపతిరెడ్డి, రాంరెడ్డి ఉన్నారు.
గోదావరిఖని/జ్యోతినగర్, నవంబర్ 9: కోరుకంటి చందర్ గురువారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఇంటివద్ద కుటుంబసభ్యులతో కలిసి హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ‘ఖని’లోని సింగరేణి గ్రౌండ్లో నిర్వహించిన ఆశీర్వాద సభకు హాజరయ్యారు. అక్కడి నుంచి భారీగా తరలివచ్చిన గులాబీ దండుతో కలిసి ఎన్టీపీసీలోని రిటర్నింగ్ ఆఫీసుకు వెళ్లి ఆర్వో అరుణశ్రీకి నామినేషన్ పత్రాలు అందించారు. ఆయన వెంట మండలి చీఫ్విప్ భానుప్రసాద్రావు, నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్కుమార్, బీఆర్ఎస్ నాయకురాలు మూల విజయారెడ్డి ఉన్నారు.
మానకొండూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు అంజనేయస్వామి సన్నిధిలో పూజలు చేసి.. మానకొండూర్లో సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం కొండగట్టు ఆలయానికి వెళ్లిన ఆయనకు వేదపండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో పూజలు చేయించిన నామినేషన్ పత్రాలను వేదపండితులు రసమయికి అందించి, అశీర్వదించారు. అనంతరం మానకొండూర్కు చేరుకుని బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీవైస్ చైర్మన్ సిద్ధం వేణు, కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, వేగురుపల్లి మాజీ సర్పంచ్ ముద్దసాని శ్రీధర్రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి లక్ష్మీకిరణ్కు అందజేశారు.
జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థిగా, ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ భారీ సందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఎమ్మెల్సీ ఎల్. రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి సాదాసీదాగా మోతెరోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ ఆఫీస్కు వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేసి, తిరిగి పార్టీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భారీ జనసందోహం నడుమ పట్టణంలో ర్యాలీ తీశారు. మోతె పార్టీ కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీ, బైపాస్ రోడ్డులోని దేవీశ్రీ గార్డెన్ మీదుగా మార్కండేయ ఆలయం వద్ద యావర్ రోడ్డుకు, అక్కడి నుంచి కొత్త బస్టాండ్ చౌరస్తా, తహసీల్ చౌరస్తా మీదుగా తిరిగి పార్టీ కార్యాలయానికి వచ్చారు.
-జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 9
వేములవాడ, నవంబర్ 9: వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనరసింహారావు గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఉదయం రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆయన, అనంతరం కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, జడ్పీటీసీలు మ్యాకల రవి, నాగం భూమయ్యతో కలిసి వేములవాడ రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
సుమారు పదివేల మందికిపైగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. మూలవాగు వంతెన, రాజన్న ఆలయం, బద్ది పోచమ్మవీధి, పోలీస్స్టేషన్ మీదుగా తహసీల్ ఆఫీస్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. దారి పొడవునా కార్యకర్తలు గులాబీ జెండాలు ప్రదర్శిస్తూ.. ‘జై కేసీఆర్’ ‘జై చల్మెడ’ నినాదాలతో హోరెత్తించారు. ‘దేఖ్లేంగే’ సాంగ్పై నృత్యం చేస్తూ జోష్ నింపారు. ఓపెన్టాప్ జీపులో అభ్యర్థి చల్మెడతోపాటు వినోద్ సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రజలు నీరాజనం పలికారు. దారి మధ్యలో వారిద్దరూ పోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అంబేదర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం, రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.