పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా రాజన్న గోశాలలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటవుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో 31.60 లక్షల వీటీడీఏ నిధులతో తిప్పాపూర్లో నిర్మాణమవుతున్నది. పూర్తి పర్యావరణ హితంగా ప్రతి రోజూ 32కేవీఏ విద్యుత్ తయారీ లక్ష్యంగా చేపట్టిన పనులు తుది దశకు చేరుకోగా, ఇక్కడ తయారైన విద్యుత్ను స్థానిక ఏరియా దవాఖానతోపాటు రాజన్న ఆలయానికి వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.
– వేములవాడ, మే16
పర్యావరణ రక్షణే లక్ష్యంగా తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను నిర్మిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు వీటీడీఏ నిధులు 31.60 లక్షలతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా, వచ్చే నెల 1వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. ఆ మేరకు అధికారులు పనులను వేగవంతం చేశారు.
2.5టన్నుల పేడ.. 32కేవీఏ విద్యుత్
బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ తయారీకిగాను ప్రతి రోజూ 2.5 టన్నుల పశువుల పేడను వినియోగించనున్నారు. మూడు ప్రక్రియల ద్వారా పశువుల పేడ గ్యాస్ ఆధారిత ప్లాంట్లోకి ద్రవ రూపంలో చేరుతుంది. అక్కడ జరిగే కెమికల్ రియాక్షన్ ద్వారా వెలువడే గ్యాస్ను జనరేటర్కు అనుసంధానించి ప్రతి రోజూ 32 కేవీఏ విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ విద్యుత్తును ఏరియా దవాఖానతోపాటు ఆలయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. దీని ద్వారా వచ్చే గ్యాస్ను అవసరమైతే వంట అవసరాలకు కూడా వాడుకోవచ్చన్నారు. కాగా, బయోగ్యాస్ కోసం వినియోగించే పేడ నుంచి వచ్చే వ్యర్థాలు తిరిగి సేంద్రియ ఎరువుగా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అందుకు ప్లాంట్లో ప్రత్యేకంగా స్టోరేజీ ట్యాంకు ఉంటుందని, దాని నుంచి తీసుకొని పంటలకు ఎరువుగా వాడుకోవచ్చని అంటున్నారు.
ఉమ్మడి జిల్లాలోనే మొదటి ప్లాంట్
బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే వేములవాడలో తొలిసారి నిర్మిస్తున్నారు. రాజన్న గోశాలలో ఉండే కోడెల ద్వారా వచ్చే పేడను వినియోగించుకుంటూ విద్యుత్ను తయారు చేయనున్నారు. ఎలాంటి పర్యావరణానికి నష్టం లేకుండానే విద్యుత్ తయారు కానుండగా, అందుకు సంబంధించిన పనులు కూడా చకచకా చేస్తున్నారు.
పనులు వేగవంతంగా చేస్తున్నాం
సుందరం ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బయోగ్యాస్ ఆధారిత పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. గోశాల నుంచి వచ్చే పశువుల పేడను రోజూ 2.5 టన్నులను వినియోగించుకొని 32 కేవీఏ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి తర్వాత వెలువడే వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు.
– నర్మద, ఏఈ మున్సిపాలిటీ (వేములవాడ)