ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ముహూర్తం ఖరారైంది. అందుకు సంబంధించి తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ గురువారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ విడుదల కానున్నది. అందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం జిల్లా విద్యాధికారులతో రాష్ట్ర విద్యశాఖాధికారులు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీలు, పదోన్నతులకు కావాల్సిన కసరత్తు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తాజాగా విడుదలయ్యే షెడ్యూల్ ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 8 నుంచి 10వేల మంది ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశమున్నది. అలాగే సుమారు 350 హెచ్ఎం పోస్టులు భర్తీ కానుండగా, దాదాపు 1200 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు వచ్చే అవకాశముండగా, టీచర్ల ట్రాన్స్ఫర్లపై ఉత్కంఠ నెలకొన్నది.
– కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి శుక్రవారం అధికారికంగా షెడ్యూల్ విడుదల కానున్నది. ఈ మేరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు సబంధించి తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ గురువారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సదరు ప్రతిపాదనల ప్రకారం చూస్తే ఈ నెల 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, అక్టోబర్ 3 వరకు బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నది. అందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తుండగా, రాష్ట్ర విద్యశాఖ జిల్లా విద్యాధికారులను అప్రమత్తం చేసింది. 2018 జూలైలో చివరి సారిగా ఉపాధ్యాయ బదిలీలు జరిగాయి. ఆ తదుపరి వివిధకారణాలతో జరగలేదు. తిరిగి 2023 జనవరిలో ఉపాధ్యాయ బదిలీలకోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అందులో స్పౌజ్ కేటగిరికి అదనంగా పది పాయింట్లు, అలాగే యూనియన్ నాయకులకు అదనంగా పది పాయింట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది ఉపాధ్యాయలు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో బదిలీలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర కోర్టు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పౌజ్ అదనపు పాయింట్లు ఉంచుతూ.. యూనియన్ నాయకులకు మాత్రం పాయింట్లను అనుమతించలేదు. ఆ మేరకు కోర్టు తీర్పునకు లోబడి.. ఉపాధ్యాయ బదిలీలను చేసేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల బదిలీలు జరిగే అవకాశాలున్నాయి. 2018 నుంచి నేటి వరకు ఉపాధ్యాయులు బదిలీల కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలైతే భారీగా దరఖాస్తులు చేసుకునే అవకాశమున్నది. ఆ మేరకు ఉపాధ్యాయ బదిలీలు భారీగానే జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. గత బదిలీలు, అలాగే తాజా షెడ్యూల్లో రాబోయే నిబంధనల ప్రకారం ఉమ్మడి జిల్లా మొత్తం మీద దాదాపు 8 నుంచి పదివేల బదిలీలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు భారీగా హెచ్ఎంలుగా పదోన్నతులు రానున్నాయి. అధికారుల అంచనా ప్రకారం సుమారు 350 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతులు రానున్నాయి. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో 1200లకుపైగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు రానున్నాయి. తద్వారా ఎస్జీటీ ఖాళీలు ఏర్పడనున్నాయి. వాటిని తాజా డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి.