కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 26 : గణతంత్ర వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.. అనంతరం అంతటా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి.. కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి కలెక్టరేట్లలో కలెక్టర్లు పమేలా సత్పతి, యాస్మిన్ బాష, అనురాగ్ జయంతి, ముజామిల్ఖాన్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలను తిలకించారు.
ఈ సందర్భంగా ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. కరీంనగర్లో కలెక్టర్తో పాటు ఎంపీ బండి సంజయ్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు. అనంతరం వివిధ బ్యాంకుల నుంచి మహిళలకు రుణాల చెక్కులను అందజేశారు.
కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జగిత్యాలలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎస్పీ సన్ప్రీత్సింగ్ పాల్గొన్నారు.
పెద్దపల్లిలో జరిగిన వేడుకల్లో జిల్లా జడ్జి డాక్టర్ డీ హేమంత్ కుమార్, పెద్దపల్లి జోన్ డీసీపీ ఎం చేతన, అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకలకు ఈడీ కేదార్ రంజన్పాడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్లలోని డీపీవో కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.