కరీంనగర్, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి); సమైక్య రాష్ట్రంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి. ఆడబిడ్డలు కిలోమీటర్ల కొద్దీ నడిచి తెచ్చిన బిందెడు నీటితో ఇంటిల్లిపాదీ గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి. కలుషిత నీటితో రోగాలపాలైన దయనీయ స్థితి. బోరు నీళ్లతో ఫ్లోరోసిస్ బారిన పడి జీవచ్ఛవాల్లా మంచాలకే పరిమితమైన దుర్భర స్థితి. దశాబ్దాల సమైక్య పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కనిపించిన ఇలాంటి క‘న్నీటి’ దృశ్యాలెన్నో. కానీ, అపర భగీరథడు ముఖ్యమంత్రి కేసీఆర్, మది నుంచి ఉద్భవించిన ‘మిషన్ భగీరథ పథకం’ జల గోసకు శాశ్వత పరిష్కారం చూపింది. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందిస్తూ ఏండ్ల నాటి కష్టాలను కడతేర్చింది. ఆడబిడ్డలకు కిలోమీటర్ల కొద్దీ నడిచే బాధ తప్పడమే కాదు, ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగు పడింది. బోరుబావులు దూరమై.. గోదావరి నీళ్లు ఇంటి ముంగిటకే వచ్చి చేరుతున్నాయి. సీఎం సంకల్పం సమస్త్త నీటిగోసను తీర్చడమేకాదు, ఇది కదా మన తెలంగాణ అని సగర్వంగా ఆడబిడ్డలు చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మంచినీళ్ల పండుగ నిర్వహిస్తుండగా, ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో తాగునీటి గోసను తీర్చిన మిషన్ భగీరథ పథకంపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఆడబిడ్డల గోస తీర్చి, ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంలో భాగంగా.. 2016 ఆగస్టులో మిషన్ భగీరథ పైలాన్ను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించకపోతే మళ్లీ ఓటు అడుగనంటూ బహిరంగసభ సాక్షిగా చెప్పిన సీఎం, ఆదిశగా పనులు పూర్తి చేసి 2018 ఎన్నికలకు వెళ్లారు. ఇది ముఖ్యమంత్రి పట్టుదలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఆనాడే అభిప్రాయపడ్డారు.
రామన్నపేటలో ఫ్లోరైడ్ మాయం
మల్యాల మండలం రామన్నపేటది ఉమ్మడి జిల్లాలోనే ఒక విచిత్ర పరిస్థితి. ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న గ్రామం ఇది. చాలా మంది ఫ్లోరైడ్ బారిన పడి శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలతో సతమతమయ్యారు. తాగేందుకు స్వచ్ఛమైన నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఫ్లోరైడ్ కారణంగా ఎముకల్లో శక్తి లేకపోవడం, శారీరక దుర్భలత్వం, వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించడం వంటి సమస్యలను రామన్నపేట ప్రజలు పుట్టుకతోనే అనుభవించారు. ఏండ్ల తరబడిగా ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యకు స్వరాష్ట్రంలో మిషన్భగీరథ ద్వారా పరిష్కారం లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అగ్రహారంలోని రామప్ప చెరువుకు, అక్కడి నుంచి పైప్లైన్ ద్వారా రామన్నపేటలోని నీటి ట్యాంకులకు మూడేళ్లుగా సురక్షితమైన నీటిని మిషన్ భగీరథ అధికారులు సరఫరా చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే గ్రామపంచాయతీ పరిధిలో వినియోగంలో ఉన్న ఇంటింటికీ నీరందించే పైపులైన్లకు ట్యాంకు ద్వారా ఈ జలాలను అనుసంధానం చేయడంతో ఇప్పుడిప్పుడే గ్రామ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తున్నది. మిషన్ భగీరథ కింద గ్రామంలోని 2500 మంది జనాభాకు, 522 ఆవాసాలకు, 380 ఇండ్లకు ప్రతి నిత్యం స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. దీంతో గ్రామస్తుల్లో సాంత్వన కనిపిస్తున్నది. రెండేండ్లుగా గ్రామంలో జన్మిస్తున్న పిల్లల్లో ఫ్లోరైడ్ వల్ల సంక్రమించే ప్రమాదకరమైన సమస్యలు లేవని వైద్యులు చెబుతున్నారు. ఇటు గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ తమ పాలిట అమృతంగా మారిందని ఆనందం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతున్నారు.
ఫ్లోరైడ్ ప్రమాదం తప్పింది
మిషన్ భగీరథ ద్వారా మా గ్రామ పరిధిలో ఫ్లోరైడ్ సమస్య ఇప్పుడిప్పుడే తగ్గుతున్నది. పూర్థిస్థాయిలో స్వచ్ఛమైన జలాలను ప్రజలు వినియోగించుకున్నపుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఏదేమైనా సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే భావితరాలకు సైతం ఫ్లోరైడ్ రక్కసి నుంచి ప్రమాదం తప్పింది. మా గ్రామపంచాయతీ పరిధిలో సైతం ఇప్పుడిప్పుడే ఫ్లోరైడ్ శాతం తగ్గుముఖం పడుతున్నది. ఇన్నాళ్లూ ఈ సమస్యలతో బాధపడిన వారు ఇప్పుడిప్పుడే నిమ్మలమవుతున్నారు. వారి శరీరాలు మెల్లిగా సహకరిస్తున్నాయి. పాత వారికంటే పుట్టే పిల్లల్లో ఫ్లోరైడ్ వల్ల వచ్చే సమస్యలు ఉండటం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఇది అన్నింటికంటే సంతోషించే విషయం.
కరీంనగర్లో రోజూ నీటి సరఫరా
కరీంనగర్ ప్రజలకు మిషన్ భగీరథతో నీటి కటకట తప్పింది. ఒకప్పుడు రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెప్పడమే గానీ, ఒక గంట కూడా ఇవ్వక పోయేది. నీటి ఆధారంగా ఉన్న ఎల్ఎండీ రిజర్వాయర్లో వేసవి వచ్చిందంటే నీటి మట్టం తగ్గేది. దీంతో ఏరియాల వారీగా ఇచ్చేవారు. అంతే కాకుండా, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవారు. అయితే, ఇవి కూడా సరిపోకపోయేవి. దీంతో ప్రజలు, ప్రజా ప్రతినిధులు నీటి కోసం అనునిత్యం ఆందోళనలు చేసేవారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ పథకం కింద 116 కోట్లు ఖర్చు చేసి నగర ప్రజల దాహం తీరుస్తున్నారు. ఒకప్పుడు రోజు విడిచి రోజు వచ్చే నీళ్లు ఇప్పుడు ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సరఫరా చేస్తున్నారు.
కొన్ని రోజుల్లో 24 గంటల పాటు మంచి నీటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. హౌసింగ్బోర్డు కాలనీని ప్రయోగాత్మకంగా ఎంచుకుని ఇక్కడ 24 గంటలు సరఫరా చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం నగరంలోని కట్టరాంపూర్లో ఫిల్టర్ బెడ్స్ను నిర్మించారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. 45 కిలో మీటర్ల మేర కొత్త పైప్లైన్ వేశారు. ఇవన్నీ పూర్తయితే త్వరలోనే 24 గంటలపాటు నగరానికి మంచి నీళ్లు సరఫరా చేయచ్చు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
మిషన్ భగీరథ కింద ఉమ్మడి జిల్లాలో 2048 వరకు పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆనాడే ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఆ ప్రకారం 2018 నాటికి 6.189 టీఎంసీలు, 2033కు 7.696 టీఎంసీలు, 2048కు 9.264 టీఎంసీలు తాగునీరు అవసరమని అంచనా వేశారు.కొత్తగా 1,351 ట్యాంకులు నిర్మించారు.అదనంగా 7,692 కిలోమీటర్ల పైపులైన్ వేశారు. కొత్తగా మూడు లక్షలపై చిలుకు కుళాయి కనెక్షన్లు కొత్తగా ఇచ్చారు.13 నియోజకవర్గాలకు 6 గ్రిడ్స్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
మిషన్ భగీరథ కింద గతంలో సగటున ఇచ్చిన నీటికన్నా అదనంగా ఇస్తున్నారు. గ్రామ పరిధిలో గతంలో ఒక్కో వ్యక్తికి రోజుకు 40 లీటర్లు ఇచ్చేవారు. మిషన్ భగీరథ కింద ప్రస్తుతం 100 లీటర్లు ఇస్తున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో గతంలో 100 లీటర్లు ఇవ్వగా దానిని 135కు పెంచారు. కార్పొరేషన్ పరిధిలో గతంలో రోజుకు 100 లీటర్లు ఇవ్వగా, వాటిని 150 లీటర్లకు పెంచారు. డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేస్తున్నారు.
ఆరు వాటర్ గ్రిడ్ల పరిధిలో ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు 18,970 హెచ్పీ మోటర్లను వినియోగిస్తున్నారు. అందుకు కొత్తగా ఆరు 11 కేవీ, పద్నాలుగు 33 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు.
మిషన్ భగీరథ కోసం 138.56 ఎకరాల భూమి సేకరించారు. 18 చోట్ల జాతీయ రహదారులను క్రాస్ చేస్తూ పైపులైన్ వెళ్లే పనులు పూర్తి చేశారు. 717 ఆర్అండ్బీ రహదారులు, 412 చోట్ల కెనాల్స్, 794 చోట్ల పంచాయతీ రాజ్ రోడ్లను క్రాస్ చేస్తూ పైపులైన్ వెళ్లింది. అలాగే 26 చోట్ల రైల్వేలైన్ క్రాసింగ్ చేయాల్సి ఉండగా పనులు పూర్తిచేసి నీటిని సరఫరా చేస్తున్నారు.
నాడు రోగాలకు కారకం
భూగర్భ జల వనరులను మాత్రమే ఉమ్మడి జిల్లాలో సరఫరా చేయడం వల్ల ఆ నీరు మందంగా ఉండడంతోపాటు అందులో వివిధ హానికర లవణాలు, సూక్ష్మ క్రిములుండేవి. దీంతో పూర్వ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ లాంటి వ్యాధుల బారిన పడ్డారు. వీటి వల్ల ఎముకలు వంకర్లు తిరగడం, దంతాలు పాడవడమే కాకుండా.. త్వరగా ముసలి తనం వచ్చేది. తాగునీరు కలుషితం అయినప్పుడు.. వేలాది మంది కలరా, టైఫాయిడ్, జ్వరాల బారిన పడేవారు. అధిక మోతాదులో లవణాలుండే బావి నీటిని దీర్ఘ కాలికంగా తాగడం వల్ల కొన్ని సార్లు మూత్ర పిండాలు దెబ్బతినేవి.
నేడు అమృతధార
భగీరథ నీరు ఎంతో శ్రేష్టమైనది. ఆరోగ్యాన్ని పంచుతుంది. నీటిలో అనేక ఖనిజాలు, లవణాలు ఉండడంతో అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. ఒక లీటరు నీటిలో పీహెచ్ 6.8-8.5, కాల్షియం 60, మెగ్నీషియం 20, నైట్రేట్ 20, టీడీఎస్ 100-300, క్లోరైట్ 75, సల్ఫేట్ 40, సోడియం 60 మిల్లీ గ్రాముల చొప్పున ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఎన్నో ప్రయోజనాలు మిషన్భగీరథ నీటిలో తగిన పాళ్లలో లవణాలు(టీడీఎస్) ఉండడం వల్ల నీరసం రాదు. అంతర్గత అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి. గుండె రక్తనాళాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.క్రమం తప్పకుండా నీటిని తాగితే శరీరానికి అవసరమగు పీహెచ్ పెరిగి నీటి ఆమ్ల స్థితి తగ్గుతుంది. క్షార స్థితి పెరిగి శరీర అంతర్భాగంలోని అవయవాలు బాగా పనిచేస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.నీటిలో ఫ్లోరైడ్ కావాల్సిన స్థాయిలో ఉండడం వల్ల వృద్ధులు, మధ్య వయస్సు వారు, చిన్న పిల్లలో ఎముకలు ధృఢంగా ఉంటాయి.కాల్షియం మోతాదులో ఉండడం వల్ల ఎముకల పెరుగుదల సాఫీగా ఉంటుంది.మెగ్నీషియం మోతాదు స్థాయిలో ఉండడం వల్ల శరీరంలోని అన్ని రకాల జీవ రసాయనిక క్రియలు బాగుపడతాయి.
మిషన్ భగీరథ నీటిలో నైట్రేట్ మోతాదు స్థాయిలో ఉండడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలోని నరాల సంకోచ, వ్యాకోచాలు మెరుగవుతాయి.
నేడు మంచి నీళ్ల పండుగ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచినీళ్ల పండుగ నిర్వహించనున్నారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తారు. మహిళలతో సభ నిర్వహించి గతంలో మంచినీటి కోసం పడ్డ కష్టాలను, మిషన్ భగీరథతో లబ్ధిని వివరిస్తారు. రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతిలో సభ నిర్వహిస్తారు.