మంచి నిర్ణయం తీసుకోవాలి
ద్రోహం చేసిన వ్యక్తి దిగజారి మాట్లాడుతున్నడు
ఏడేండ్లు పదవిలో ఉండి ఏంజేసిండు
ఆత్మగౌరవమని చెప్పి గడియారాలు పంచుతుండు
కుమ్మరుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపుతున్నడు
పేదింటి బిడ్డ గెల్లు సీనును ఆశీర్వదించి పంపిండు
అఖండ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుకిద్దాం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
హుజూరాబాద్లో రజక, జమ్మికుంటలో కుమ్మరుల ఆశీర్వాద సభలు
కరీంనగర్, (నమస్తే తెలంగాణ)/ జమ్మికుంట/ జమ్మికుంట చౌరస్తా, సెప్టెంబర్ 26 : ఉమ్మడి రాష్ట్రంలో చిన్నాభిన్నమైన కులవృత్తులకు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పునరుజ్జీవం పోస్తున్నదని, కేంద్రంలో ఉన్న బీజేపీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను కాపాడుతున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్లో రజక, జమ్మికుంటలో కుమ్మరుల ఆశీర్వాద సభలకు హాజరైన ఆయన, ఆయా కులస్తులనుద్దేశించి ప్రసంగించారు. ‘సీఎంకు అండగా ఉండేందుకే ఈ రోజు ఇంత మంది ఇక్కడికి వచ్చిన్రు. ఇగ మిమ్మల్ని జూత్తే ఈటల ఆగమైతండు. వేరే చోటి నుంచి తీసుకచ్చిండ్రని దిగజారి మాట్లాడుతున్నడు. మీరంతా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలే కదా.. ఈటల తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిండు.. పదవి అప్పజెప్తే అభివృద్ధిని విస్మరించిండు.. నాలుగువేల ఇండ్లు ఇస్తే ఒక్కటి కట్టియ్యలే.. తప్పు చేసిండని పక్కనబెడితే.. రాజీనామా చేసి బీజేపీలో చేరిండు. ఆత్మగౌరవమంటూ ఓట్ల కోసం గడియారాలు, గొడుగులు పంచుతున్నడు.. ఆయన కుట్రలను తిప్పికొట్టాలె. కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలె..? కేసీఆర్ ఆశీర్వదించి పంపించిన పేందింటి బిడ్డ గెల్లు సీనునే గెలిపించి సీఎం సారుకు కానుకివ్వాలి’ అని పిలుపునిచ్చారు. కుమ్మరులను నాటి ప్రభుత్వాలు పట్టించుకోని వైనాన్ని దుయ్యబట్టారు. స్వరాష్ట్రంలో కుమ్మరులకు 148జీవోను అందించిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు.
చెరువు మట్టిపై హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. నియోజకవర్గంలో 320 మందికి సారెలిచ్చామని, కరంట్ సాంచాలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలని, ప్రజా వ్యతిరేక బీజేపీని తరిమి కొట్టాలన్నారు. బీజేపీ ఏం ముఖం పెట్టుకుని ఓట్లకొస్తున్నదని ప్రశ్నించారు. మరో రెండున్నరేండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని, గెల్లును గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఆరుసార్లు టీఆర్ఎస్కే ఓటేసి గెలిపించిన చరిత్ర మీదని, మరోసారి కారు గుర్తుకే ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కాళ్లు మొక్కైనా సరే.. ఇక్కడికి అయిదు వేల ఇండ్లు తెస్తా.. కట్టించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. గెల్లు సీనుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు, గెల్లును కుమ్మరులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు మంత్రి హరీశ్రావు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ యంత్రాన్ని తిప్పి కుండను తయారు చేశారు. మంత్రి కొప్పులకు అందించారు. సాయిచంద్ సాయిచంద్ కుమ్మరుల కులవృత్తిపై పాడిన పాటకు మంత్రి హరీశ్తో పాటు పలువురు చప్పట్లు కొడుతూ.. కోరస్ కలిపారు. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే చందర్, నాయకులు కౌశిక్రెడ్డి, రాజేశ్వర్రావు, జయంత్రావు, బాలకృష్ణ, రమేశ్, శ్రీనివాస్, ప్రభాకర్, తిరుపతి, రవీందర్, పావని, వేణుగోపాల్, భానుచందర్ ఉన్నారు.
బీజేపీకి ఓటుతోనే పోటు పొడవాలి
‘ధరలు పెంచుతూ సామాన్యులను ఇబ్బందులు పెడుతున్న బీజేపీకి ఓటుతోనే పోటు పొడవాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి పన్నులు వేయడం తప్ప పనులు చేయడం రాదని స్పష్టం చేశారు. హుజూరాబాద్లో జరిగిన రజక ఆశీర్వాద సభలో మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ రజకుల ఆత్మగౌరవాన్ని ఆకాశానికెత్తారని తెలిపారు. మహనీయురాలి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న ఆంధ్రా, కర్ణాటక ప్రజలు ఇక్కడి రజక నాయకులకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారని తెలిపారు.
బీజేపీకి ఓటెందుకు వేయాలి?
హుజూరాబాద్లో బీజేపీ నాయకులు ఓటెయ్యాలని తిరుగుతున్నారని, వారికి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలని సూచించారు. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం బీసీలకు ఏమిచ్చిందని, ఏం చేశారో చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో తనకు పలుకుబడి ఉందని చెప్పుకొంటున్న రాజేందర్కు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని, హుజూరాబాద్ ప్రజలపై ప్రేమ ఉంటే రూ.2 వేల కోట్ల ప్యాకేజీ తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఇచ్చే డబ్బులు, బొట్టు బిల్లలు, గడియారాలు, మేక పోతులను చూసి మోసపోవద్దని, పని చేసే ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. తాము కష్టపడి పని చేస్తామని హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటేనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. రజకులకు హైదరాబాద్లో 3 ఎకరాల స్థలం, రూ. 5 కోట్లు మంజూరు చేసి చాకలి ఐలమ్మ భవాన్ని నిర్మిస్తున్నారని, రూ. 2 కోట్లతో వరంగల్లో చాకలి ఐలమ్మ భవనాన్ని నిర్మించుకోబోతున్నామని, సిద్దిపేటలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిందని, నల్లగొండలో కూడా నిర్మించుకుంటున్నామని, ఇప్పుడు హుజూరాబాద్లో కూడా శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. రజకుల కోరిక మేరకు వీణవంక, కమలాపూర్, జమ్మికుంటలో కూడా చాకలి ఐలమ్మ భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సభలో రజక సంఘం నాయకులు కొలిపాక శ్రీనివాస్, నల్ల బాలరాజు, ఆలేటి శ్రీరాం, నిమ్మటూరి సాయికృష్ణ, కొండపాక పవన్, కే సాంబయ్య, పూసాల సంపత్ కుమార్, సదానంద, వెంకటేశ్వర్లు, రాజు, పైడిపల్లి రాకేశ్, గూడెపు రాజు, కొలిపాక రవి, సదానందం, వెంకటేశ్వర్లు, పైడిపల్లి ఆంజనేయులు, రవీందర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రజకులు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలి వచ్చారు. ఆటపాటలతో సాయిచంద్ బృందం అలరించింది.