ఫర్టిలైజర్సిటీ, అక్టోబర్ 23: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసానికి గురి కాకుండా కమిషనరేట్ పోలీసులు నిత్యం అడ్డుకట్ట వేసేందుకు శ్రమిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు నూతన పంథాలో జరుగుతుండడం సాధారణమైన అంశంగా పరిణమించిందని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణాల్లో ఇలాంటి నేరాలపై వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నామని వివరించారు. గత వారం రోజుల్లో పలు సైబర్ నేరాలు నమోదయ్యాయని తెలిపారు. హాజీపూర్ గ్రామానికి చెందిన ఓ బాధితుడికి నేరగాడు ఫోన్ చేసి ఫోన్ కేవైసీ అప్డేట్ కాలేదంటూ రూ.4999 మోసం చేశాడన్నారు. గత నెల 24న బసంత్ నగర్కు చెంది న ఓ బాధితుడికి ఫోన్పే క్యాష్ రివార్డు అంటూ రూ.1855లు, అదే నెల 28వ తేదీన హాజీపూర్కు చెందిన ఓ బాధితుడు ఫేస్బుక్ చూస్తున్నప్పుడు పార్ట్టైం జాబ్ గురించి యాడ్ రాగా బాధితుడు అట్టి నంబర్కు మెసేజ్ చేయగా కమిషన్ ఇచ్చినట్టే ఇచ్చి డబ్బు విత్ డ్రా చేసుకోకుండా అడ్డుకున్నాడని, ఇదే నెల 18న కాజీపేటకు చెందిన ఓ బాధితుడు యోనో అప్లికేషన్లో పాన్ కార్డు వివరాలు అప్డేట్ లేవంటూ రూ.4వేలు మోసం చేశాడన్నారు. ఉద్యోగావకాశాలు, తక్కువ ధరలో వస్తువులు, వాహనాలు అంటూ వచ్చే మెసేజ్లు, లింక్లు తెరువకూడదని సూచించారు. ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే టోల్ ఫ్రీ నంబరు డయల్ 100, 155260కు సంప్రదించాలని సీపీ పేర్కొన్నారు.
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి రామగుండం కమిషనరేట్తోపాటు పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు శనివారం గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్కు ఆయన హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడారు. ఈ పరేడ్తో దేహ దారుఢ్యం సాధ్య పడుతుందన్నారు. వ్యక్తిగత, విధు లు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్ డ్రిల్, ఆమ్ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మోనల్ను పరిశీలించారు. ఇక్కడ అడ్మిన్ డీసీపీ అశోక్ కుమార్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు తదితరులున్నారు.