జమ్మికుంట, జనవరి25: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావుపై 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో పెట్టిన అవిశ్వాసం ఎట్టకేలకు వీగిపోయింది. 27 రోజుల ఉత్కంఠకు తెరపడింది. గురువారం మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస పరీక్ష కోసం కమిషనర్ బీ శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఏసీపీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణ సీఐలు బర్పటి రమేశ్, రమేశ్ బందోబస్తు ఏర్పాటు చేయగా, ప్రత్యేకాధికారి మహేశ్వర్ (కరీంనగర్ ఆర్డీవో) కార్యాలయానికి చేరుకున్నారు.
షెడ్యూల్ సమయం ఉదయం 10 గంటలలోపు చైర్మన్ రాజేశ్వర్రావుకు 14 మంది, అవిశ్వాస తీర్మానం పెట్టిన పొనగంటి మల్లయ్య వర్గంలో 16 మంది కౌన్సిలర్లు హాజరవుతారని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 10.20గంటలకు కేవలం 10వ వార్డు కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి ఒక్కరే హాజరయ్యారు. ఆ తర్వాత ప్రత్యేకాధికారి అవిశ్వాస పరీక్షను మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేశారు. అయినా సభ్యులెవరూ హాజరుకాలేదు. 1.30 గంటల తర్వాత ప్రత్యేకాధికారి మహేశ్వర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. షెడ్యూల్ సమయంలో సభ్యులు హాజరుకాలేదని, కోరం లేదనందువల్ల అవిశ్వాసం వీగిపోయిందని అధికారికంగా ప్రకటించారు.దీంతో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ చౌక్ వద్ద సంబురాలు చేసుకున్నారు. పటాకలు కాల్చారు. స్వీట్ల పంపిణీ చేశారు.