పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 22: జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. వానకా లం ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత వానకాలంలో 2,11,090 ఎకరాల్లో వరి సాగు అయిందని, 5,11,226 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, సుమారు 4.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 292 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని అధికారులు వివరించగా, రెండు రోజుల్లో కేంద్రాల తుది జాబితా సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 25 తేదీ నుంచి 27వ తేదీ దాకా నాణ్యతా ప్రమాణాల అంశంపై ఏఈవోలు, సెంటర్ ఇన్చార్జిలకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకొని 17 శాతం లోపు తేమ, 1శాతం లోపు చెత్త తాలు, 1 శాతం లోపు మట్టి రాళ్లు, 5 శాతం లోపు పురుగు తిన్న, రంగు మారిన ధాన్యం, 3 శాతం ముడుచుకు పోయిన ధాన్యం ఉండేలా తరలించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, డీఆర్డీవో శ్రీధర్, మార్కెట్ అధికారి ప్రవీణ్రెడ్డి, డీఏవో తిరుమల ప్రసాద్, జిల్లా అధికారులు తోట వెంకటేశ్, విశ్వేశ్వర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.