కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 28 : ఎన్నికలేవైనా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న కృషి ఫలిస్తోంది. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు అమల్లోకి తెచ్చి, వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనకెందుకులే అనుకునే స్థాయి నుంచి కళ్లకు కనిపించిన మరుక్షణమే అరచేతిలో నుంచే సమాచారం చేరవేసేలా పౌరుల్లో చైతన్య బీజాలు నాటింది. దీంతో, ఎన్నికల సంఘం నిర్ధేశించిన నిబంధనల ఉల్లంఘనులపై ఫిర్యాదుల వెల్లువ మొదలు కాగా, వెంట వెంటనే కేసులు కూడా నమోదవుతుండడంతో అభ్యర్థుల్లో నిబంధనల గుబులు వెంటాడుతోంది. ఎన్నికల్లో జరిగే అవినీతి, అక్రమాలను అడ్డుకోవడం సామాజిక బాధ్యతగా ప్రచారం చేస్తూ, శ్రమలేకుండా అరచేతి నుంచే ఫిర్యాదు చేసే డిజిటల్ విధానానికి ఈసీఐ శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్, ఈ-సువిధ వంటి పలు యాప్లను అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికలకు సంబంధించి తమకు వచ్చే అనుమానాలను కాల్సెంటర్ ద్వారా ఓటర్లు నివృత్తి చేసుకుంటున్నారు. ప్రధానంగా ఎపిక్ నంబర్లు తెలుసుకోవడం, కొత్త ఎపిక్ కార్డులు, పోలింగ్ కేంద్రాల వివరాలు, హోం ఓటింగ్ విధానం, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న వసతులు, తదితర వివరాలపై ఎలక్షన్ కంట్రోల్ రూమ్కు నిత్యం ఫోన్లు వస్తున్నట్లు నోడల్ అధికారి నాగార్జున పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు 800 పైచిలుకు కాల్స్ వచ్చినట్లు తెలిపారు.
అలాగే, ఎన్నికల సంఘం సూచించిన గడువు మించి అభ్యర్థులు ప్రచారం చేస్తుండడం, ఈసీ సూచించిన డెసిబుల్స్ ధ్వని కన్నా అధికంగా వినియోగిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండడం, ఒకేచోట ప్రచార వాహనాలు నిలపడం, ఓట్ల కోసం పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న విధానం, నజరానాల పంపిణీ, ఈ-సువిధలో తీసుకున్న సమయాన్ని మించి ప్రచారం చేస్తుండడంపై సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడిస్తున్నారు. 103 ఫిర్యాదులు రాగా, సత్వరమే స్పందిస్తూ తగిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 15, హుజూరాబాద్ నుంచి 7, కరీంనగర్ నుంచి 66, మానకొండూర్ నుంచి 15 వరకు వచ్చినట్లు అధికారులు విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఎన్నికల తంతు ముగిసే వరకు వీటి సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండనున్నాయి. నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తుండగా, అది నేరుగా జిల్లా ఎన్నికల సంఘానికి చేరుతుంది. ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలోని మానిటరింగ్ సెల్కు వెళ్తుంది. అక్కడి నుంచి మరో ఐదు నిమిషాల్లో క్షేత్రస్థాయిలో తిరిగే ఫ్లయింగ్ స్కాడ్ బృందాలకు చేరవేస్తారు. ఆ బృందాలు 15 నిమిషాల్లో ఫిర్యాదు చేసిన స్థలానికి వెళ్ళి విచారిస్తూ, అరగంటలో రిటర్నింగ్ అధికారికి నివేదిక అందజేస్తుండగా, 50 నిమిషాల్లో పరిశీలించి, ఉల్లంఘనలు జరిగితే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రోజురోజుకూ సీ-విజిల్ ఫిర్యాదులు పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.