కరీంనగర్, జూన్ 9(నమస్తే తెలంగాణ): పరిపాలన వికేంద్రీకరణ.. ప్రజల చెంతకే పాలన.. పాలనా సౌలభ్యం.. ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఈ పదాలు.. కొన్నేండ్ల కిందటి వరకు పత్రికల్లో చదవడం.. కాదంటే నాయకుల నోట వినడం మాత్రమే తెలుసు.. కానీ, ఏనాడూ ప్రజలకు అర్థం కాలేదు. 1905లో నిజాం రాజు పాలిస్తున్నప్పుడు జిల్లాల పునర్విభజన జరుగగా, 111 ఏండ్లకు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సామాజిక తత్వవేత్త కేసీఆర్ ప్రజల చెంతకు పాలన చేరాలని.. అధికారుల దర్శనం కోసం జనాలు రావడం కాదు.. జనాల మధ్యకు అధికారులు వెళ్లాలని.. సామాజిక సంపద, సహజ వనరుల ఫలితాలు అన్ని ప్రాంతాలకు సమంగా పంపిణీ కావాలని గుర్తించి.. చిన్న జిల్లాల ఏర్పాటుకు నాంది పలుకడంతో తెలంగాణలో సుపరిపాలనకు బీజం పడింది. 2016 అక్టోబర్ 11న దసరా పర్వదినం రోజు చేసిన జిల్లాల పునర్విభజనతో 40 లక్షల జనాభా, 57 మండలాలతో ఉన్న అతిపెద్ద కరీంనగర్ జిల్లా నాలుగు చిన్న జిల్లాలుగా మారింది. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ విప్లవాత్మక చర్య పరిపాలన రంగాన్ని సుసంపన్నం చేసి, ప్రజలకు పాలనను చేరువ చేసింది. ఒకప్పుడు కలెక్టర్, ఎస్పీని సాధారణ ప్రజలు, మారుమూల గ్రామవాసులు చూడాలంటే ఏండ్లు దాటి దశాబ్దాలు పట్టేది. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కీలక అధికారులను కలువడం గగనమయ్యేది. స్వరాష్ట్రంలో చేపట్టిన పరిపాలనా సంస్కరణలతో జిల్లా స్థాయి అధికారులు ఇప్పుడు ప్రజలకు అత్యంత చేరువయ్యారు.
కోరుట్ల మండలం మోహర్రావుపేట అడవుల్లో పూర్తిగా కుల్లిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలిని దండుగుల పోసానిగా నిర్ధారించుకున్నారు. ఆమెది హత్య అన్న ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కోరుట్ల పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఎలాంటి క్లూ లభ్యం కాలేదు. చివరకు ఆమెకు సెల్ఫోన్ ఉందని తెలుసుకున్న పోలీసులు, కేసు ఛేదన బాధ్యతలు ఐటీ విభాగానికి అప్పగించారు. ఫోన్ నంబర్ ఆధారంగా సెల్ నుంచి చేసిన కాల్స్, సెల్కు వచ్చిన కాల్స్ డాటాను పరిశీలించారు. పోసాని మేడిపెల్లికి వెళ్లిందని సెల్ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు. సెల్ఫోన్ కాల్డాటా, సీసీ కెమరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికే చెందిన అల్లెపు ఎల్లయ్యను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నాలుగేండ్ల కాలంలోనే ఎల్లయ్య చేసిన హత్య నిరూపణ కావడంతో ఇటీవలే ఆయనకు జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. డిజిటలైజేషన్, సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వం పారదర్శక పాలన చేస్తుందనడానికి ఇలాంటి అనేక ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
పరిపాలనా వికేంద్రీకరణలో మైలురాళ్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వికేంద్రీకరిస్తూ నాలుగు జిల్లాలుగా ప్రభుత్వం మార్చింది. అంతే కాకుండా, ప్రజలకు మేలైన పాలన అందించేందుకు కావాల్సిన ప్రతి వ్యవస్థను వారికి చేరువ చేసేందుకు ప్రయత్నించింది. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు 57 మండలాలు ఉండగా, జిల్లాల పునర్విభజన తర్వాత కొన్ని ఇతర జిల్లాల్లోకి వెళ్లాయి. దీంతో 46 మండలాలు మిగిలాయి. అయితే, పలు గ్రామాల ప్రజలకు మండల కేంద్రాలు సైతం దూరంగా ఉన్నాయని భావించిన ప్రభుత్వం, కొత్తగా 17 మండలాలను ఏర్పాటు చేసింది. గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ధ్యేయం అన్న సీఎం కేసీఆర్ 150 జనాభా ఉన్న తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా మార్చివేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు వరకు ఉమ్మడి జిల్లాలో 1022 జీపీలు ఉండగా, కొత్తగా మరో 193 పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో వందకు పైగా గిరిజన తండాలు కావడం గమనార్హం. 150 జనాభా ఉన్న తండాలు సైతం నేడు గ్రామ సీమలుగా సొంత పాలనలో వెలిగిపోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు 5 రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్తగా మరో 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు కావడంతో సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాల సంఖ్య సైతం పెరిగిపోయింది. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు 8 మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా మరో 8 మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, రాయికల్, కొత్తపల్లి, వేములవాడ వంటి పట్టణాలన్నీ మున్సిపాలిటీలుగా మారిపోయాయి. అలాగే, పూర్వ మున్సిపాలిటీల్లో జనాభాకు అనుగుణంగా వార్డులను సైతం పునర్విభజన చేయడంతో ప్రజలకు పాలన చేరువగా వచ్చింది. స్వరాష్ట్రం ఏర్పడక ముందు మున్సిపాలిటీలుగా 257 మున్సిపల్ వార్డులు ఉండగా, కొత్తగా 204 వార్డులు ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఒకప్పుడు 57 పోలీస్ స్టేషన్లు ఉండగా, రాష్ట్ర అవతరణ తర్వాత కొత్తగా 12 స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు 21 వ్యవసాయ మార్కెట్యార్డులుండగా, కొత్తగా మరో 16 యార్డులను ఉనికిలోకి తీసుకువచ్చారు. మూడు జిల్లాల్లో విద్యుత్, ఆబ్కారి, పరిశ్రమలు, మత్స్య, నీటి పారుదల శాఖల కార్యాలయాలు జిల్లాల స్థాయిలో ఏర్పాటయ్యాయి. ఇలా అనేక పరిపాలనా సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాలను ప్రజలకు చేరువగా తీసుకురావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వపరిపాలన.. సుపరిపాలనగా రంజిల్లుతోంది.
డిజిటల్ విధానంలో పారదర్శక పాలన
స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రంగంలో సాంకేతిక నైపుణ్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. దీంతో అన్ని రంగాల్లోనూ పారదర్శక పాలన అందుతోంది. సబ్ రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఇక కోశాగారానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులు, వేతనాలు, పెన్షన్ల పంపిణీ, తదితర పనులన్నీ డిజిటలైజేషన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌరసరఫరాల శాఖకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా తమ రేషన్ కార్డుపై సరుకులు తీసుకునే వ్యవస్థ ఏర్పడింది. మున్సిపాలిటీ నుంచి మొదలుకొని ఆర్టీసీ వరకు అన్ని శాఖల్లోనూ సాంకేతిక పరిజ్ఞానాన్నే వినియోగిస్తున్నారు. ఇక పోలీస్ విభాగమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని నేరాల నివారణలో కొత్త పుంతలు తొక్కుతోంది. సెల్ఫోన్ ఆధారంగా, సీడాట్, సీ 5, పర్ఫుల్ రేడియన్స్, ఐక్యూబ్ వంటి అధునాతన సాఫ్ట్వేర్ను వినియోగించి నేరస్తులను పట్టుకునేందుకు యత్నిస్తోంది. ఇక ఈ చలాన్లు, ఈ పెట్టీ కేసులను సైతం ఆన్లైన్లోనే నమోదు చేస్తూ త్వరగా చెల్లింపులు, కేసుల పరిష్కారానికి కృషి చేస్తోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో నాలుగు కేంద్రాలు అందుబాటులోకి రావడంతో నాలుగు చోట్ల సైబర్ క్రైమ్ ల్యాబ్లతో పాటు, ఐటీ వింగ్లు ఏర్పాటు చేయడంతో పోలీసింగ్ వ్యవస్థ అత్యంత చురుగ్గా పనిచేసూ సత్వర సేవలు అందించగలుగుతోంది.
పంచాయతీగా మారిన రాయికల్ తండా.
ఇదీ.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ తండా. 2016లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన తర్వాత ఈ తండా ఉనికిలోకి వచ్చింది. అంతకు ముందు ఘనపూర్ పంచాయతీ కింద ఘనపూర్ తండా, పెరుకపల్లె కింద నల్లాని (ఆకునూర్) తండా, రాయికల్ కింద రాయికల్ తండా ఉండేవి. ప్రతి 500 జనాభా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, ఈ మూడు తండాలను కలిపి రాయికల్ తండా కేంద్రంగా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. దీంతో ఈ పంచాయతీ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. గతంలో ఆయా పంచాయతీల కింద ఉన్న ఈ తండాలు అభివృద్ధికి నోచుకోకపోయేవి. కనీసం తాగుదామంటే మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. రేషన్ బియ్యం కోసం కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు వెళ్లి తెచ్చుకునేది. ఇప్పుడు నల్లానితండాలో ఈ మూడు తండాలకు ప్రత్యేకంగా రేషన్ షాపు ప్రారంభించారు. మరో గొప్ప విషయం ఏంటంటే మిషన్ భగీరథ కింద ఈ మూడు తండాలకు మంచి నీళ్ల సదుపాయం కల్పించారు. ఇప్పుడు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన అవసరం తప్పింది. గతంలోలాగా ఆయా గ్రామ పంచాయతీల కింద ఉంటే ఈ గ్రామానికి ప్రత్యేక ట్రాక్టర్ వచ్చేది కాదు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, డంప్ యార్డ్ వంటి ఆస్తులు సమకూరేవి కాదు. అన్ని తండాల్లో కలిపి రూ.35 లక్షలతో సీసీ రోడ్లు వేయించారు. తాజాగా, అన్ని తండాలను కలుపుతూ రూ.2 కోట్లతో ఘనపూర్ నుంచి రాయికల్ వరకు బీటీ రోడ్డు నిర్మించారు. ఈ విషయాన్ని ఇటీవలే హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ వెల్లడించారు. 500 జనాభా ఉన్న తండాను ప్రత్యేక పంచాయతీగా మార్చి, సర్పంచ్ సహా వార్డు సభ్యులను ఎన్నుకుని, ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు చానా ఇబ్బందులు పడ్డం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు జిల్లా కేంద్రానికి చానా దూరం ఉండేది. దీంతో చానా ఇబ్బందులు పడ్డం. మా ఊరి నుంచి కరీంనగర్ దాదాపు 80 కిలోమీటర్లు ఉంటది. ఏ జిల్లా అధికారిని కలవాలన్నా రోజు మొత్తం పట్టేది. అంత దూరం వెళ్తే అధికారులు దొరికే వారు కాదు. దొరికినా వారిని కలవాలంటే చాలా మంది ఉండేది. అయితే, పెద్దపల్లి జిల్లా అయినంక జిల్లా కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరం తగ్గింది. ఇప్పుడు పని సులువైంది. ఏ పని మీద పెద్దపల్లికి వెళ్లినా రెండు మూడు గంటల్లో పని చేసుకొని వస్తున్నం. అధికారులపైన కూడా భారం తగ్గింది. మా సమస్యలను కూలంకషంగా విని పరిష్కరిస్తున్నరు. మా ఊరి పరిస్థితి కూడా అధికారులందరికీ ఎరుకైంది. మనం ఏం చెబుతున్నమో.. అది నిజమో అబద్దమో కూడా వాళ్లకు తెలుస్తున్నది. కొంత మంది జిల్లా అధికారులతో మేం టచ్లో కూడా ఉంటున్నం. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమానికి ఒక జిల్లా అధికారి మా మండలానికి ఇన్చార్జిగా ఏస్తున్నరు. దాంతోటి ఒక్కో జిల్లా అధికారితోటి పరిచయాలు కూడా అవుతున్నయ్. జిల్లా ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్ కూడా చాలా సార్లు మా మండలానికి, గ్రామానికి వస్తున్నరు. గ్రామాల్లో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నయ్.
-ఐతె రాజు. ఓడేడు గ్రామస్తుడు, ముత్తారం మండలం, (పెద్దపల్లి జిల్లా)